చంద్రన్న దోపిడీ అంటే బాగుంటుంది: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ ఏపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తెలుగుదేశం నేతలకు మాత్రమే మేలు జరిగేలా ఉన్నాయని ఆరోపించారు. పేదలకు నిత్యావసర సరుకులు ఒక్క సంక్రాంతికే కాకుండా ప్రతినెలా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా పేదలకు సరుకులు ఇచ్చామన్నారు. చంద్రన్న కానుక అంటూ సంక్రాంతి సరుకుల కొనుగోలులో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. చంద్రన్న కానుక అనకుండా చంద్రన్న దోపిడీ అనాలేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నిలుపుకోకుండా చంద్రబాబు ప్రజలను మధ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.
లోటుబడ్జెట్ను చంద్రబాబు అధిగమిస్తున్నారు: నారాయణ
అపార పాలనా అనుభవం ఉన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర లోటు బడ్జెట్ని అధిగమిస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. సూళ్ళూరుపేటలో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లెమింగో ఫెస్టివల్ను సూళ్ళూరుపేటలో నిర్వహించడం ఇదే మొదటిసారని అన్నారు. జలరవాణా ప్రారంభమైతే, ఇది ఇండిస్ట్రయల్ కారిడార్గా మారుతుందని మంత్రి నారాయణ చెప్పారు.