రహస్య అజెండా కోసమే లక్ష ఎకరాలు: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూసేకరణ అవసరమా అని ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో ప్రభుత్వ సంస్థలు వందల ఎకరాల్లోనే ఉన్నాయని తెలిపారు.
విజయవాడ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములను ఇతరత్రా అవసరాలకు సేకరించరాదనే ఏకాభిప్రాయం ఉందని రఘువీరా చెప్పారు. రహస్య అజెండాతోనే ప్రభుత్వ పెద్దలు లక్ష ఎకరాలు సేకరించాలనుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా సహకరించిన వారికి లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ అసలు అజెండా అని రఘువీరా రెడ్డి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మధ్య ఏపి రాజధాని ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం లక్ష ఎకరాల భూమిని సేకరించాలనే యోచనలో ఉన్నట్లు పలువురు మంత్రులు కూడా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రఘువీరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.