చంద్రబాబు కొంటున్నారు: 'పార్టీ మారే ఎమ్మెల్యేలు భిక్షగాళ్ల కంటే హీనులు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'పై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తొలిసారిగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. జూన్ నెలలో జరగనున్న రాజ్యసభ సీట్ల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యేలు వైసీపీని వీడటం వెనుక జగన్ ప్రమేయం కూడా ఉందని అన్నారు. జగన్ చేసిన ప్రకటన వల్లే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. జగన్ క్షమాణప కోరితే పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలు భిక్షగాళ్ల కంటే హీనులని మండిపడ్డారు.
తిరుపతిలో భవనం కూలి ఒకరు మృతి
తిరుపతిలోని ఇసుకవీధిలో మూడంతస్తుల భవనం బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని హారిక అనే యువతి మృతి చెందింది. మరో బాలిక గ్రీష్మ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వేలూరు సీఎంసీకి తరలించారు. డ్రైనేజీ కాలువ తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు స్పందిస్తూ బాధితులను ఆదుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కలెక్టర్ సిద్ధార్థజైన్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమలదొడ్డి దగ్గర ఐఎంఎల్ మద్యం డిపోలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 వేల కేసుల మద్యం సీసాలు, 11వేల బీర్ బాటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.24 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిందని అంచనా వేశారు. షార్ట్ సర్య్కూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు అంటున్నారు.