బాబు ఏపీలో పులి, మోడీ వద్ద పిల్లి: రఘువీరా, మల్లాది మాటేంటి: బొండ ఉమ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పులి అని, ప్రధాని నరేంద్ర మోడీ వద్ద మాత్రం పిల్లి అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు పరస్పరం పొగుడుకూంటూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఒకరినొకరు పొగుడుకునేందుకే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ హక్కులను చంద్రబాబు నాయుడు ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించాలని హితవు పలికారు. జన్మభూమి కమిటీల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
రఘువీరాపై బొండా ఉమ ఆగ్రహం
రఘువీరా రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే హక్కు లేదన్నారు. జన్మభూమి కమిటీల్లో అవినీతి జరిగితే నిరూపించాలన్నారు. కల్తీ మద్యం కేసులో ఇరుక్కున్న మల్లాది విష్ణును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో రఘువీరా చెప్పాలన్నారు.
పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటా: సీఎం రమేష్
కడప జిల్లాలోని పోట్లదుర్తిని అభివృద్ధి చేస్తానని, తద్వారా తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన ఆదివారం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పోట్లదుర్తి, మాలేపాడు గ్రామాల్లో పశువుల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.