జగన్, బాబు, బీజేపీలదే బాధ్యత, మేం చూసుకుంటాం: హోదాపై రఘువీరా
విజయవాడ: తమ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు టిడిపి, వైసిపి, బిజెపి మద్దతిచ్చి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. మద్దతు, ఓటు వేసే బాధ్యత వారిదే అన్నారు.
ప్రత్యేక హోదాపై పావులు, ఎవరికి షాక్?: 'కాంగ్రెస్' కేవీపీకి బాబు కౌంటర్
కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు టిడిపి, బిజెపి మద్దతివ్వడమే కాకుండా, ఓటు కూడా వేయాలన్నారు. ఆ రెండు పార్టీలు బేషరతుగా మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. వైసిపి కూడా మద్దతివ్వాలన్నారు. ఆ పార్టీలు ఓటు వేయాలని విప్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏకే 47 గురి పెట్టినట్లుగా టిడిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. విభజన చేసే అధికారం మీకు ఉందని, మీరు చేయమని వైసిపి అధినేత జగన్ చెప్పారన్నారు. బీజేపీ కూడా విభజనకు మద్దతు పలికిందన్నారు. విభజనలో బిజెపి, టిడిపి, వైసిపిల పాత్ర ఉందన్నారు.
టిడిపి, వైసిపి, బిజెపిలే కాకుండా మిగతా పార్టీలను కూడా తాము కలిసి మద్దతు కోరుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనుందని చెప్పారు. ఈ విషయాన్ని తాము పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. రేపు విప్ జారీ చేస్తామన్నారు.
మిగతా పార్టీలతో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నారని చెప్పారు. వాళ్ల సహకారం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి వెన్నెముక అన్నారు. పరిశ్రమలకు రాయితీలు వస్తాయని చెప్పారు. తమకు ఏపీ అభివృద్ధి ముఖ్యమని చెప్పారు.
చంద్రబాబు ఆయన పేరుతో ఉన్న చంద్రమండలానికి పోయి వచ్చినా, విదేశాలు ఎన్నిసార్లు తిరిగినా పెట్టుబడులు రావన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు వస్తాయన్నారు. హోదా లేకపోవడం వల్ల ఈ రెండేళ్ల పాటు ఎలాంటి పెట్టుబడులు రాక.. హాలీడే వచ్చినట్లుగా ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు పైన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ప్రత్యేక హోదా పైన తమతో టిడిపి, వైసిపి, బిజెపిలు కలిసి రావాలని, ఆ క్రెడిట్ వారు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రయివేటు బిల్లు ఆయన పార్టీ కోసం తీసుకు రాలేదని, రాష్ట్రం కోసం తెచ్చారన్నారు.
జులై 22 ఏపీకి ఎంతో కీలకం: కేవీపీ బిల్లుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ
ఈ నెల 22వ తేదీన బిల్లు వస్తుందని, అప్పటికి ఎలాంటి కుట్ర చేయవద్దన్నారు. ఈ బిల్లుకు బిజెపి, టిడిపిలు అడ్డుపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దానిని పోస్టుపోన్ చేస్తే ఆ బాధ్యత ఆ పార్టీలదే అన్నారు. గత సమావేశాలలో కుట్ర చేశారన్నారు.
అప్పుడే బిల్లు ఓటింగుకు రావాల్సి ఉండేనని, రాకుండా చేశారని, ఇప్పుడు అడ్డుపడవద్దని సూచించారు. ప్రత్యేక హోదా పైన బిజెపి, టిడిపి, వైసిపిల బాధ్యత వారిదేనని, మిగతా పార్టీలను మాత్రం మేం ఒప్పిస్తామని చెప్పారు. సిపిఐ, సిపిఎం, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీలు ఇప్పటికే తమకు మద్దతిచ్చాయన్నారు. ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతివ్వాలని తాము లేఖలు కూడా రాశామన్నారు.