సిగ్గూమానం లేదా: ఫిరాయింపులపై రఘువీరా రెడ్డి
హైదరాబాద్: ఫిరాయింపులను ప్రోత్సహించేవారికి సిగ్గూమానం, మర్యాద లేదా అని ఎపిపిసిసి రఘువీరా రెడ్డి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీలు కొంత మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైన స్థితిలో ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. అసలైన టిడిపి ఎన్టీఆర్తోనే క్లోజైందని, ఇప్పుడు పార్టీలో ఉన్నవారంతా నకిలీలే అని ఆయన అన్నారు. చంద్రబాబు ఒకప్పుడు కాంగ్రెసు నాయకుడేనని ఆయన అన్నారు.
టిడిపిలో ఉన్నవారంతా ఇతర పార్టీలకు చెందినవారేనని ఆయన అన్నారు. టిడిపి అహంకార ధోరణి సరి కాదని ఆయన అన్నారు. ఎవరూ కాంగ్రెసు పార్టీని విడిచి వెళ్లవద్దని ఆయన సూచించారు. వెళ్లదలిచినవారు రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలోని నిర్ణయాలపై ఎన్ని కమిటీలైనా వేసుకోవచ్చునని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు.
ఎన్డీయె ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైల్వే చార్జీలపై పెంపుపై వైఖరి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. రైల్వే చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రైల్వే చార్జీలు ఏకపక్షంగా పెంచడం సరి కాదని ఆయన అన్నారు.
ఎన్డీఎ ప్రభుత్వం ఏకపక్షంగా రైల్వే చార్జీలు పెంచిందని ఆయన అన్నారు. తాను నియంతను అని దేశానికి చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోడీ వేసిన తొలి అడుగుగా దీన్ని చూస్తున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో టిడిపి కూడా ఉంది కాబట్టి రైల్వే చార్జీల పెంపుపై చంద్రబాబు వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంపై ఆయన పెదవి విరిచారు. గవర్నర్ ప్రసంగానికి దశాదిశా లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి మంత్రివర్గం తాయరు చేసిన రాజకీయ ప్రసంగాన్ని గవర్నర్ చదివినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
టిడిపి, బిజెపి సంకీర్ణ మంత్రివర్గం ఎన్నికలు ముగిశాయనే విషయాన్ని కూడా మరిచిపోయినట్లుందని, ఎన్నికలకు ముందు వాడిన పదజాలాన్ని గవర్నర్ ప్రసంగంలో వాడిందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో మొదట్లో తమ పార్టీని నిందించే పనిని పెట్టుకున్నారని, ఆ తర్వాత రాష్ట్ర దివాళా పరిస్థితిలో ఉందని చెప్పడానికి చూశారని, ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే నమ్మకం లేకుండా పోతోందని ఆయన అన్నారు.