రాజధానిపై రఘువీరా హెచ్చరిక, అప్పుడే వద్దని దేవినేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక విషయంలో అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంతో పాటు అన్ని మార్గదర్శకాలు విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నాయని పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారు. ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లుగా హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేసి తీరాలన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫీజురీయింబర్సుమెంట్స్ విషయంలో 1956 స్థానికత విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
అప్పుడే విమర్శించలా?: దేవినేని
తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అవుతోందని, అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం సరికాదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కృష్ణా జిల్లాలో అన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.