మహాత్మా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు...
పాదయాత్ర ఎప్పుడూ తనను నమ్ముకున్నవారిని మోసం చేయలేదు. దేశానికి స్వాతంత్య్ర పోరాటం సాధించేందుకు నడుం బిగించిన జాతిపిత మహాత్మా గాంధీ నుంచి 2024లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు అందరూ పాదయాత్రనే నమ్ముకున్నారు. ఉప్పు సత్యాగ్రహంతో నిర్వహించిన పాదయాత్ర దేశ స్వాతంత్ర్య పోరాటం కీలక మలుపు తిరగడానికి కారణమైంది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 1983లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు ఆరునెలలు 4260 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

వైఎస్ కుటుంబానికి పాదయాత్రకు అవినాభావ సంబంధం!
పాదయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబానికి, 'పాదయాత్ర'కు అవినాభావ సంబంధం ఉంది. ఎంతమంది నేతలు, పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మికులు... ఇలా ఎవరు పాదయాత్ర చేసినా రాని పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ఆయన 2003లో ఈ యాత్ర చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2013లో మీకోసం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు.

రెండు సంవత్సరాలపాటు పాదయాత్ర చేసిన జగన్!
2017లో కడపలోని ఇడుపులపాయ నుంచి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి 2019లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. వైఎస్ కుటుంబంలో దివంగత వైఎస్, జగన్, ఆయన సోదరి షర్మిల ముగ్గురు పాదయాత్ర చేశారు. షర్మిల 230 రోజులపాటు మూడువేల కిలోమీటర్ల మేర యాత్ర చేశారు. ప్రస్తుతం ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాదయాత్ర చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కోసం..
ప్రస్తుతం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3570 కిలోమీటర్లమేర భారత్ జోడో యాత్ర చేపట్టారు. 12 రాష్ట్రాల్లో 148 రోజులు ఈ యాత్ర సాగనుంది. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న మతోన్మాదం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాసమస్యలను వినిపించడానికి ఈ జోడో యాత్ర కీలకమైందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మార్గంగా రాహుల్ పాదయాత్రనే నమ్ముకున్నారు. ప్రతిరోజు 25 కిలోమీటర్లు రాహుల్ నడవనున్నారు. యాత్రలో భాగంగా జరిగే బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనడానికి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఒక అడుగు నీది.. ఒక అడుగు నాది.. యాత్రలో చేరి మనందరం భారత్ ను ఏకం చేద్దాం అనే నినాదంతో ఈ భారత్ జోడో యాత్ర సాగుతోంది.












Click it and Unblock the Notifications