నాశనమైంది!: కిరణ్పై రాహుల్ ఆగ్రహం, ఇక.. నేనొస్తా
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కారణంగానే సీమాంధ్రలో పార్టీ నాశనం అయిపోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారట. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలతో శనివారం విడివిడిగా భేటీ అయ్యారు.
సీమాంధ్రకు చెందిన చిరంజీవి, డొక్కా మాణిక్య వర ప్రసాద్, రఘువీరా రెడ్డి, తెలంగాణ నేతలు డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి రాహుల్తో వేర్వేరుగా చర్చలు జరిపారు.
ఒక్కొక్కర్నీ పిలిచి మాట్లాడిన రాహుల్ ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ఇతర పార్టీల బలాబలాల గురించి ఆరా తీశారు. త్వరలో పిసిసి, ఎన్నికలు, ప్రచార కమిటీలు, మేనిఫెస్టో కమిటీలు వేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీమాంధ్రలో పార్టీ జీరోకు వెళ్లిపోయిందని, ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, పార్టీని మళ్లీ కింద నుంచి పైకి తీసుకు రావాల్సిందేనని, గతంలో కాంగ్రెస్ను అభిమానించే వర్గాలన్నీ పార్టీకి దూరమయ్యాయని, సామాజిక సమీకరణల ద్వారా ప్రజల్లోకి వెళితేనే పూర్తిగా కొట్టుకుపోకుండా కాపాడుకోగలమని సీమాంధ్రకు చెందిన నేతలూ రాహుల్కు వివరించారుట.
ఈ సందర్భంగా, వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడిందని, దీనికి తోడు జగన్, కిరణ్ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రస్తుత పరిస్థితికి కిరణే కారణమని, ఆయన నాయకత్వం వహించి పార్టీ పథకాలను ప్రచారం చేయడమే కాకుండా రాష్ట్ర విభజన గురించి పాజిటివ్గా చెప్పి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రాహుల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
అందరూ లేఖలు ఇచ్చిన తర్వాతే మనం నిర్ణయం తీసుకున్నామని, సీమాంధ్రకు ప్యాకేజీలు కూడా ఇచ్చామని, అయినా కాంగ్రెస్పై వ్యతిరేకత ఎందుకని రాహుల్ ప్రశ్నించగా.. బిజెపి కారణంగా ప్యాకేజీ ఇచ్చినట్లు జనంలోకి వెళ్లిందని సీమాంధ్ర నేతలు చెప్పినట్లు తెలిసింది. సభలు పెట్టాలని, తాను వస్తానని, సీమాంధ్రకు కొత్తగా ఏం కావాలో ఓ నివేదిక తయారు చేసి ఇవ్వాలని, ఎన్నికల ముందు వచ్చి హామీ ఇస్తానని చెప్పారట. ఆంధ్రప్రదేశ్ను వదులుకోకూడదని సూచించారని తెలుస్తోంది.