కాంగ్రెస్ 'కోటి సంతకాల' జాబితా: తొలి, మలి సంతకాలు ఎవరివంటే?
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్, త్వరగా కోలుకోవాలంటే ఏపీకి ప్రత్యేక హోదా పాటు ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరి అని వైసీపీ అధినేత వైయస్ జగన్తో పాటు ఏపీలోని మేధావుల్లో వ్యక్తమవుతోంది.
దీంతో ఈ వాదనను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వానికి వినిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రఘవీరారెడ్డి మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఏపీలోని 13 జిల్లాల నుంచి మట్టి, నీరు సేకరించి ఢిల్లీకి తరలించారు.
దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల సేకరణను కూడా ఆయన చేపట్టారు. అయితే ఈ సంతకాల్లో మొదటి, చివరి సంతకాలు ఎవరు పెట్టారనే ఆసక్తి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే.
ఇలా గత కొన్ని రోజులుగా సంతకాల సేకరణను చేపట్టగా... చివరకు బుధవారం నాడు చివరి సంతకం కూడా చేశారు. ఇంతకీ ఆ చివరి సంతకం ఎవరిదో తెలుసా?. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటి సంతకాల సేకరణ జాబితాలో చివరి సంతకం చేశారు.
ఏపీసీసీ ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి సంతకం చేసిన చిరంజీవి... స్వయంగా ఆ కాగితాలను పట్టుకుని రాహుల్ గాంధీ వద్దకెళ్లి చివరి సంతకం చేయించారు.
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ను విభజించిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ క్రమంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ పెద్దలు భుజానికి వేసుకున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకువచ్చి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చనే ఆలోచనలో ఉన్నారు.