Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిరణ్ రెడ్డిపై రాహుల్ వ్యాఖ్య: శ్రీకృష్ణ కమిటీ సందర్భం?

హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం తాము చేసిన తప్పిదమేనని ఎఐసిసి ఉపాధ్యక్షుడు, అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి అప్పటి రాజకీయ సందర్భం మరోసారి చర్చకు వచ్చినట్లయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రహస్య అధ్యాయం అందుకు సంబంధించిన విషయాలపై కాస్తా వెలుగును ప్రసరింపజేస్తుంది.

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమంపై పరిశీలించి ఓ నివేదికను సమర్పించింది. ఆ నివేదికతో పాటు ఓ రహస్య అధ్యాయాన్ని కూడా రూపొందించి ఇచ్చింది. దాన్ని ఎనిమిదో అధ్యాయం అన్నారు. అదే తర్వాత రహస్యమైన నోట్‌గా మారింది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దాదాపుగా ప్రత్యామ్నాయం లేదంటూనే సమైక్యాంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయనికి ప్రాధాన్యం ఇచ్చింది. అందుకు గాను తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు అవసరమైన సూచనలను రహస్యమైన నోట్‌లో పొందు పరిచింది.

కోర్టు తీర్పు వల్ల అది బహిర్గతమైంది. అది బహిర్గతం కావడం వల్ల పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీడియాను మేనేజ్ చేయడం, తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులను మేనేజ్ చేయడం, అప్పటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో కలిసి కాంగ్రెసు పార్టీలోని ఓ సామాజిక వర్గం పనిచేయాల్సిన అవసరం వంటివాటిని చూసిస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు కీలకమైన పదవులు ఇవ్వాలని సూచించింది. ఆ కీలకమైన పదవుల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది అత్యంత ముఖ్యమైంది.

Rahul on Kiran reddy: Behind the scenes?

ఈ స్థితిలోనే జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావించింది. ఇందుకు సంబంధించి అప్పట్లో మీడియాలో ఊహాగానాలు పెద్ద యెత్తునే చెలరేగాయి. దానికి తగినట్లుగానే రహస్యమైన నోట్‌లో ఆ ప్రస్తావన ఉంది. హోం శాఖ మాజీ కార్యదర్శి దుగ్గల్ ఈ నోట్‌ను రూపొందించారనే ప్రచారం కూడా ఉంది. 2010 సెప్టెంబర్‌లోనే అప్పటి హోం మంత్రి పి. చిదంబరంతో, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంపై చర్చించానని, అది అయిందని ఆ రహస్య నోట్‌లో రాశారు. దాదాపుగా జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయమైందనే ఉద్దేశంతో ఆ మాటలు రహస్య నోట్‌లో రాసినట్లు కనిపిస్తోందని ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే గ్రంథంలో రచయిత గౌతం పింగ్లే రాశారు.

అయితే, జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడానికి అంగీకరించలేదు. తెలంగాణలోని పరిస్థితులు తెలియడం వల్ల కావచ్చు, సన్నిహితులు సలహా ఇవ్వడం వల్ల కావచ్చు ఆయన వెనక్కి తగ్గారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తూ దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అంటే, శ్రీకృష్ణ కమిటీ సూచనను కాంగ్రెసు అధిష్టానం తూచా తప్పకుండా పాటించిందనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంలోనే రాసిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వానికి సమర్పించే సమయంలో శ్రీకృష్ణ కమిటీ దాన్ని మార్పు చేయడం మరిచిపోయి ఉండవచ్చు. అది అలాగే నోట్‌లో చోటు చేసుకుంది.

2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో పెల్లుబుకిన ఉద్యమం నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. శ్రీకృష్ణ కమిటీ యథాతథ స్థితిని కొనసాగించడానికి అవసరమైన రహస్యమైన ఎజెండాను అప్పటి యుపిఎ ప్రభుత్వానికి సూచించింది. అందులో భాగంగా జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయం తీసుకుంది. జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గడంతో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి, తెలంగాణ నాయకుడు దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది.

అంత చేసినప్పటికీ చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్యంతో అప్పటి యుపిఎ ప్రభుత్వం లేదా కాంగ్రెసు అధిష్టానం పడింది. శ్రీకృష్ణ కమిటీ మేనేజ్‌మెంట్ చేయడానికి ఇచ్చిన సూచనలేవీ పారకపోవడం వల్లనే కాంగ్రెసు అధిష్టానానికి కూడా ఎదురు దెబ్బ తగిలింది తప్ప కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమో, మరొకరిని చేయకపోవడమో కాదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి నిరాకరించిన నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరమైన నేపథ్యంలో తెలంగాణలోని ఓ సామాజిక వర్గాన్ని కలుపుకుని రావడానికి, రాయలసీమలో ఆ సామాజిక వర్గం కాంగ్రెసుకు దూరం కాకుండా ఉండడానికి కిరణ్ కుమార్ రెడ్డి తప్ప కాంగ్రెసు అధిష్టానానికి, ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణ ఉద్యమంలో ఉన్న దళిత విద్యార్థులు, ఇతర రంగాల్లోని దళితులు చల్లబడుతారని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ, పరిస్థితి ఎదురు తిరిగింది. దామోదర రాజనర్సింహకు, కిరణ్ కుమార్ రెడ్డికి పడని పరిస్థితి ఏర్పడడమే కాకుండా, అనుకున్నట్లుగా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి అవసరమైన మేనేజ్‌మెంట్ చేయడంలో విఫలమయ్యారు. అదే కాంగ్రెసును దెబ్బ తీసిందని చెప్పవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+