వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక చిరంజీవి అనే రైల్వే ఉద్యోగి గుంతకల్లులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెలనెల వడ్డీని చెల్లిస్తోన్న తనను వేధిస్తున్నారని ఆయన ఓ లేఖరాసి ఆత్మహత్య చేసుకొన్నాడు.
గుంతకల్లు :వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది.వడ్డీలు చెల్లిస్తోన్న వేధింపులు తీవ్రం చేయడమే కాకుండా తన కుటుంబాన్ని కోర్టుకు ఈడుస్తానని బెదిరించడంతో చిరంజీవి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
గుంతకల్లుకు చెందిన చిరంజీవి భార్య గుత్తి రైల్వేస్టేషన్ లో పనిచేసేది. అనారోగ్య కారణాలతో ఆమె మరణించింది. ఆమె మరణంతో కారుణ్య నియామకం కింద ఆమె ఉద్యోగాన్ని చిరంజీవి పొందాడు.
రైల్వే విద్యుత్తు విభాగంలో చిరంజీవి సహాకుడిగా పనిచేస్తున్నాడు. డిఆర్ ఎం కార్యాలయంలో విద్యుత్తు సరఫరా చపనులు చేస్తుంటాడు చిరంజీవి. ఈయనకు కుమారుడు.. కుమార్తె ఉన్నారు. శాంతినగర్ రైల్వే కాలనీలో నివాసం ఉంటున్నాడు. అవసరం కోసం వడ్డీ వ్యాపారుల వద్ద కొంత మొత్తాన్ని ఆయన అప్పుగా తీసుకొన్నాడు.
ఈ అప్పుకు నెలనెల వడ్డీలు చెల్లిస్తున్నాడు. ఒకటి లేదా రెండు నెలలు వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీ వ్యాపారి కోర్టుకు ఈడుస్తానని బెదిరిస్తున్నాడు. అంతే కాదు రెట్టింపు అప్పును వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నాడు.
ఈ బెదిరింపులతో చిరంజీవి భయానికి గురయ్యాడు. అసలు కంటే వడ్డీ ఎక్కువ చెల్లించినా వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక పోయాయని ఆయన మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయాలన్నీ ఓ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.