విశాఖ రైల్వే జోన్ అంశం పై తేల్చేసిన రైల్వే మంత్రి..!!
ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దొరికింది. విశాఖ రైల్వే జోన్ వ్యవహారం రైల్వే బోర్డు యూ టర్న్ తీసుకుందంటూ వస్తున్న వార్తలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర పునర్విభజన చట్టం అంశాల పైన చర్చ జరిగిన సమయంలో విశాఖ రైల్వే ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు నిర్ణయం మార్చుకుందనే వార్తలు వచ్చాయి. విశాఖ రైల్వే జోన్ గా ఫీజబులిటీ లేదని నివేదికలు రావటంతో , రాజకీయ నిర్ణయం కోసం ఆ ప్రతిపాదనను కేంద్రానికి నివేదించామంటూ రైల్వే బోర్డు అధికారులు చెప్పినట్లుగా ప్రచారం సాగింది.
విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం క్లారిటీ
ఇప్పటికే ప్రచారంలో ఉన్న వార్తల పైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి స్పందించారు. అసలు విభజన అంశాలపైన చర్చ సమయంలో విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదన్నారు. రాజధాని నుంచి కోవూరు మీదుగా తెలంగాణకు రైల్వే లైన్ గురించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. విశాఖకు రైల్వే జోన్ కోసం తమ పార్టీ నేతలు పోరాటం చేసారని గుర్తు చేసారు.
విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని విజయ సాయిరెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీకి చెందిన బీజేపీ నేతలు అసలు రైల్వే జోన్ అంశం ఆ సమావేశంలో చర్చకు రాలేదని, విశాఖ రైల్వే జోన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
స్పష్టత ఇచ్చిన రైల్వే మంత్రి
ఈ సమయంలోనే టీడీపీ నేతలు సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసారు. ఇక, ఢిల్లీ వేదికగా కేంద్ర రైల్వే మంత్రి స్వయంగా ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పై ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టంగా తేల్చి చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. జోన్ ఏర్పాటు కు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. భూమి కూడా అందుబాటులో ఉందని మంత్రి తేల్చి చెప్పారు.
జోన్ పనులు కొనసాగుతున్నాయి
జోన్ ఏర్పాటుకు డీఆర్ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశారని వివరించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తు చేసిన కేంద్ర మంత్రి..జోన్ ఏర్పాటుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ జోన్ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేసారు. దీంతో, ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ పైన జరుగుతున్న చర్చకు ముగింపు లభించనట్లైంది.