రైల్వే సిబ్బంది అనౌన్స్మెంట్ ఫలితం: ఏపీలోని ఆ స్టేషన్లో ప్రయాణికులకు నరకం!!
ప్రయాణికులు చాలామంది రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ కొనుగోలు నుండి రైలు ఎక్కే వరకు, తమ గమ్యస్థానాన్ని చేరేవరకు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. రైల్వే స్టేషన్ కు వెళ్ళిన తర్వాత రైలు ఎక్కడం కోసం రైల్వే సిబ్బంది చేసే అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా సరైన సమాచారమే అయి ఉంటుందని నమ్ముతారు. అయితే తాజాగా ఓ రైల్వేస్టేషన్లో సిబ్బంది ప్రయాణికులకు షాకిచ్చారు.
రైల్వే సిబ్బంది చేసిన పొరపాటు తో దాదాపు 400 మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అసలు రైల్వే సిబ్బంది చేసిన పొరపాటు ఏమిటి? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో రైలు సిబ్బంది చేసిన పొరపాటు 400 మంది ప్రయాణికులకు గ్రహ పాటుగా మారింది.

తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో భువనేశ్వర్ వైపు వెళ్లాల్సిన రెండు రైళ్లు 5 నెంబర్ ప్లాట్ఫారం కి రావాల్సి ఉండగా, రైల్వే సిబ్బంది రెండో నెంబర్ ప్లాట్ఫారం కి వస్తాయని ప్రకటించారు. రెండవ నెంబర్ ప్లాట్ఫారం మీదకు చేరుకొని ఎదురు చూస్తుండగా అవి ఆ ప్లాట్ఫారం మీదికి రాలేదు. ఆ రెండు రైళ్లు ఐదవ నెంబర్ ప్లాట్ ఫారం కి వచ్చి, అక్కడినుండి వెళ్ళిపోయాయి.
దీంతో ప్రయాణికులు తాము ఎక్కవలసిన రైలును ఎక్కలేకపోయారు. దీంతో వారు తీవ్ర అసహనానికి లోనయ్యారు. రైల్వే సిబ్బంది చేసిన తప్పిదం వల్లనే తాము ఇబ్బంది పడ్డామని ప్రయాణికులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది ప్రతినిత్యం వేల సంఖ్యలో ప్రయాణాలు చేసే ప్రయాణికుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
రైళ్ళ రాకపోకల ప్రకటనల వల్ల కలిగిన ఇబ్బంది మాత్రమే కాదు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలాసోర్ రైళ్ళ ప్రమాదం ఘటనలు చోటు చేసుకుని అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రైల్వే సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండాలని కోరుతున్నారు రైలు ప్రయాణికులు .












Click it and Unblock the Notifications