ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు: పిడుగుపాటుకు ఒకే జిల్లాలో నలుగురు మృతి
అమరావతి: అకాల వర్షాలు కర్నూలు జిల్లాలో విషాదం నింపాయి. పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఆదోని నియోజకవర్గంలోని కుప్పగల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొలాల్లో పనిచేస్తుండగా.. పిడుగుపడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఘటనలో ఆలూరు నియోజవకర్గంలోని హోళగొంద మండలం వందవగిలి గ్రామంలో పొలాలలో పిడుగుపడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కర్నూలు జిల్లాలోనే పిడుగుపాటుకు గురువారం ఒక్కరోజే నలుగురు మృతి చెందడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
గత కొద్ది రోజులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా మండిపోతున్నాయి. గురువారం హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా వీస్తున్న ఈదురుగాలులతో హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరుకు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. బుధవారం కుడేరు మండలం చోళ సముద్ర గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. భారీ శబ్ధంతో పిడుగుపడటంతో జనం భయపడిపోయారు.