ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అవి తగ్గుతున్నాయి
ఏపీకి వాతావరణశాఖ చల్లని శుభవార్తను వినిపించింది. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, వచ్చే ఐదు రోజులు వానలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాయలసీమతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడుతున్నాయని, అక్కడక్కడా ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.
కొన్ని జిల్లాల్లో ఎండలు
రాయలసీమలో చెదురమదురు వానలు పడతాయని, రాబోయే రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని, ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో వానలు పడతాయంటోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని, కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం పగటివేళ ఎండ అధికంగా ఉండి సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారిపోయి వానలు కురుస్తున్నాయి.

రాష్ట్రమంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు
శుక్రవారం కూడా రాష్ట్రంలో వానలు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరులో 50, కర్నూలు జిల్లా పత్తికొండలో 43.5, అనంతపురం జిల్లా బత్తలపల్లిలో 41, కర్నూలు జిల్లా గోస్పాడులో 46.2, గుంటూరు జిల్లా అమరావతిలో 44.5, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 43,7, కృష్ణా జిల్లా గన్నవరంలో 24, కడపలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వాటి ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
ముఖ్యమైన పనులుంటేనే బయటకు రావాలి
ఎండలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ముఖ్యమైన పనులుంటే బయటకు రావాలని, లేదంటే బయటకు వచ్చే సమయంలో గొడుగును ధరించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటలకు ఇంట్లోనే ఉండాలని చెప్పారు. రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి రెండు నుంచి మూడురోజుల సమయం పట్టే అవకాశం ఉందని, నాలుగు రోజుల తర్వాత రాష్ట్రమంతటా చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications