బాబు ఫిల్మ్పై జాతీయ చర్చ: తొక్కిసలాటకు కారణం అదేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం నిర్మించ తలపెట్టిన డాక్యుమెంటరీ చిత్రం వల్లనే రాజమండ్రి దుర్ఘటన జరిగిందనే విషయంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా మంగళవారంనాడు తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
సిఎన్ఎన్ - ఐబిఎన్ లైవ్ షోలో అర్నాబ్ గోస్వామి ఈ విషయంపై చర్చాగోష్టి నిర్వహించారు. కలెక్టర్ నివేదికలోని అంశాలను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్పై ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు గంటల పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు విఐపిలు, విఐఐపిలు సామాన్యులకు నిర్దేశించిన ఘాట్లో ఉండడం వల్లనే ప్రమాదం జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు విమర్శిస్తున్నాయి.
అయితే, సిఎం రమేష్ అర్నాబ్ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి 15 నిమిషాలు మాత్రమే పుష్కర ఘాట్లో ఉన్నారని, సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. అయితే, ఈ చర్చలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాత్రం - ముఖ్యమంత్రి ఆ రోజు ఉదయం గం.6.20 నిమిషాల నుంచి గం.8.20 నిమిషాల వరకు ఉన్నారని అన్నారు.
రెండు రోజులుగా పుష్కరాల కోసం నిరీక్షిస్తున్న భక్తులను చంద్రబాబు చిత్ర నిర్మాణం కోసం రెండు గంటల పాటు నిలిపేయడం వల్ల ఆ తర్వాత భక్తులు ఒక్కసారిగా తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రచారం కోసం నిర్మించ తలపెట్టిన చిత్రం నిర్మాణం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఓ పొటోను కూడా విడుదల చేశారు. ఆ ఫొటో గురువారం నుంచి సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది.