'బాబు కుటుంబ కార్యక్రమంలా శంకుస్థాపన, సోనియాను ఎందుకు పిలవలేదు'
అమరావతి: దసరా సందర్భంగా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జరిగిన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేడుకలా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ కార్యంలా జరిపించారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం ఉదయం ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను సొంత కార్యక్రమాలుగా కలరింగ్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని ఎద్దేవా చేశారు.
అత్యంత ముఖ్యమైన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎందుకు పిలవలేదని నిలదీశారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంటులో చేసిన హామీల అమలును మాత్రం పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.