బాబాయ్ కోసం రంగంలోకి రాం చరణ్ - జనసేనకు మద్దతుగా : జగన్ కు పోటీగా -పట్టుకోసం "మెగా" స్కెచ్..!!
మెగా ఫ్యామిలీ అటు సినిమా..ఇటు రాజకీయంగానూ తమ పట్టు నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర మంత్రిగా చేసిన చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన మెగాస్టార్ ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ఇక, మరో మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తమ్ముడి పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేసారు. జనసేన ప్రస్తుతం ఏపీలో బీజేపీతో జత కట్టింది. తెలంగాణలో బీజేపీతో మాత్రం కంఫర్ట్ గా కనిపించటం లేదు. అయితే, 2024 ఎన్నికల నాటికి బీజేపీ-జనసేన బలమైన కూటమిగా బరిలోకి దిగుతామనే ధీమాతో ఉన్నారు.

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయి
టీడీపీ సైతం 2014 పొత్తు రిపీట్ చేయటానికి ప్రయత్నం చేస్తోంది. అయితే, మెగా పవర్ చాటటానికి ఇప్పుడు వారసుడు రంగంలోకి దిగారు. బాబాయ్ అంటే ఎంతో ప్రేమ చూపించే రాం చరణ్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కు చిరంజీవి మద్దతు ఉందంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా రాజకీయంగా చరకచ మొదలైంది. తాజాగా.. చిరంజీవి జన్మదినం నాడు తన ఇంటికి వచ్చిన తమ్ముడుకు అన్నయ్య ముద్దుతో ఆహ్వానించారు. అదే విధంగా పవన్ జన్మదినం నాడు నిప్పు లాంటి తమ్ముడు ఆశయం నెరవేరాలంటూ ఆకాక్షించారు.

పవన్ పార్టీ కోసం మెగా స్కెచ్
ఇక, పవన్ పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు లేదనే వాదన తిప్పి కొట్టేందుకు చరణ్ చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. ముందుగా జనసేనకు ఇప్పుడున్న డిజిటల్ క్యాంపెయిన్ తో పాటుగా ఓన్ గా టీవీ ఛానల్స్ కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ మద్దతిచ్చే మీడియా..వైసీపీ కి సొంత ఛానల్ ఉన్నాయి. దీంతో..ఎన్నికలకు ఏడాదికి ముందే జనసేనకు బలమైన ప్రచారానికి ప్లాట్ ఫాం సిద్దం చేయాలని మెగా పవర్ స్టార్ ప్లాన్ చేసారు.

జనసేన కోసమేనా కొత్త డీల్
అందులో భాగంగా గతంలో తన తండ్రి చిరంజీవి-నాగార్జున భాగస్వామ్యంతో నడిపించిన విధంగానే ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా న్యూస్ ఛానల్ కొనుగోలుకు డిసైడ్ అయ్యారని సమాచారం. ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న ఆ న్యూస్ ఛానల్ ప్రస్తుత బీజేపీ నేత మద్దతుతో నడిచింది. ఇప్పుడు అదే ఛానల్ తాను టోకేవర్ చేసి వచ్చే ఏడాదికి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాం చరణ్ ఆలోచనగా చెబుతున్నారు. సినిమాల్లోనే కాకుండా వ్యాపార పరంగానూ రాం చరణ్ సక్సెస్ అయ్యారు.

చిరంజీవి తెర వెనుకే ఉంటారా
ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాం చరణ్ మెగా స్కెచ్ తో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అటు సినిమా రంగంలో పలు సినిమాలకు రాం చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఖైదీ నెంబర్ 150, సైరా వంటి మూవీలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆచార్య మూవీ లో తండ్రితో కలిసి చేస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయంగా రీ ఎంట్రీ పైన చర్చ సాగుతోంది. ఆయన కోసం బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒక సమయంలో చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్తారనే ప్రచారమూ సాగింది.

జగన్ ను ఎదుర్కోవాలంటే..కొత్త వ్యూహాలు
కాంగ్రెస్ నేతలు సైతం చిరంజీవి తిరిగి యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. కానీ, చిరంజీవి నుంచి ఈ ప్రతిపాదనల పైన ఎక్కడా స్పందన రాలేదు. ఏపీ సీఎం జగన్ తో మాత్రం సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. రాజకీయంగా జగన్ - పవన్ మధ్య పోటీ ఉంది. జగన్ ను ఎలాగైనా అధికారంలో నుంచి తప్పించాలనేది పవన్ లక్ష్యం. జగన్ కు ఉన్న మీడియా మద్దతు కీలకమని గ్రహించిన రాం చరణ్ ..తన బాబాయ్ కు ముందుగా తన ద్వారా ఆ లోటు లేకుండా చేయాలని ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

మెగా మద్దతుతో పవన్ ముందుడుగు..
విజయదశమి నాటి రాం చరణ్ టీవీ ఛానల్ డీల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక, త్వరలోనే జనసేనకు మద్దతుగా మెగా స్కెచ్ కూడా స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ పూర్తి పవన్ జనాకర్షణ - అభిమానం మీదనే ఆధారపడి ఉంది. నేతలు పార్టీలో చాలా మంది బయటకు వెళ్లిపోయారు. అయినా..పవన్ మాత్రం బలంగానే పార్టీని నడపాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో..ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు వస్తే..పవన్ కు అది అదనపు బలంగా గా మారనుంది. దీంతో..జనసైనికులు - మెగా ఫ్యాన్స్ జరుగుతున్న పరిణామల పట్ల ఆసక్తిగా ఉన్నారు. రాజకీయంగా ఈ వ్యవహారం కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications