గబ్బర్ సింగ్ కావాలి.. బెగ్గర్ సింగ్ కాదు, కెసిఆర్ రియల్స్టార్: హోదాపై పవన్కు వర్మ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సెటైర్ వేశారు. పవన్ గబ్బర్ సింగ్ అని, బెగ్గర్ సింగ్ కావొద్దని చురకలు అంటించారు.
ఏపీకి ప్రత్యేక హోదాను సంపాదించే విషయంలో కేంద్రాన్ని అడుక్కోవడం మానాలని పవన్ కళ్యాణ్ పైన వర్మ ఓ సెటైర్ వేశాడు. బెగ్గర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్ కావాలి అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో, తన ప్రచారాన్ని నమ్మి ఓట్లు వేసిన కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేశాడని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆయన వైఖరిని తట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు. వీరుడు అడుక్కోకూడదని, ఏ కాపులకైతే మీరు పవర్ ఇచ్చారో.. వాళ్లని మీ విన్నపాలతో బీదవాళ్లను చేశారని వ్యాఖ్యానించాడు. సినిమాలలో బహిరంగంగా హెచ్చరికలు చేసి, నిజ జీవితంలో మాత్రం విన్నపాలు చేస్తే పవర్కి, స్టార్కి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు.
అరే కెసిఆర్లా నీ తాట తీస్తాననే పవర్ హీరో మాకు కావాలి. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదని, రియల్ స్టార్ కెసిఆర్ అన్నారు. విన్నపాలు కోరే పవర్ లేని స్టార్లు వద్దని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే వస్తుంది కానీ విన్నపాలతో రాదన్నారు.
'ఫ్లాప్ అయినా మాకు గబ్బర్సింగ్ కావాలి కానీ.. బెగ్గర్సింగ్ కాదు. సినిమాల్లో వార్నింగ్లు ఇచ్చి.. నిజజీవితంలో విన్నపాలు చేస్తే పవర్ స్టార్కు అర్థం ఏమిటి? డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది కానీ విన్నవిస్తే రాదు.. అభిమానులైన మాకు.. మీ నోటి నుంచి హెచ్చరికలు వినాలి. మీ నోటి నుంచి విన్నపాలు వినటం కర్ణ కఠోరంగా ఉంది' అని ఘాటుగా స్పందించారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులు బీజేపీ కూడా చేయరాదని జనసేన అధ్యక్షులు పవన కళ్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం ఆయన ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు చేశారు.
'సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని... పార్లమెంట్లో నుంచి బయటకు గెంటి... ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి... కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పు చేసింది. ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదు... మరిచిపోరు కూడా.
ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద దెబ్బకొట్టి బీజేపీ కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వెయ్యకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికారపార్టీ ఎంపీలు... ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పార్లమెంట్లో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున విన్నవిస్తున్నానని ట్వీట్ చేశారు.