రోహిత్ మృతి వెనుక రాజకీయ కారణాలు: రామకృష్ణ, వివక్ష: రేవంత్ రెడ్డి
రాజమండ్రి/హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇటీవల చోటు చేసుకున్న రోహిత్ మృతి పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం స్పందించారు. వేముల రోహిత్ మృతి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మృతి పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.
రోహిత్ మృతి పైన రేవంత్ రెడ్డి
హెచ్సియు విద్యార్థి రోహిత్ మృతి పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైదరాబాదులో స్పందించారు.
రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు హెచ్సియులో పదిమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే వివక్ష కొనసాగుతున్నట్లుగా అర్థమవుతోందన్నారు.
రోహిత్ మృతి పైన మాల మహానాడు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది. రోహిత్ మృతికి కారకులైన వారి పైన చర్యలు తీసుకోవాలని వారుడిమాండ్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.