మరో వివాదంలో రమణ దీక్షితులు: మహద్వారం ద్వారా కుటుంబంతో దైవదర్శనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. కుమారుడు, మనవళ్లతో మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకొన్నారు.నిబంధనలకు విరుద్దంగా కుటుంబసభ్యులతో రమణదీక్షితులు స్వామివారిని దర్శించుకోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రమణ దీక్షితులు మహద్వారం నుండి కుటుంబసభ్యులను తీసుకెళ్ళడం పట్ల పలువురు అర్చకులు, ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించటానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తలపాగాచుట్టే విషయంలో కంకణభట్టాచార్యుడు వేణుగోపాల దీక్షితులతో పోటీపడ్డారు.
సాధారణంగా ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. ప్రధాన అర్చకుని సతీమణి మినహా మిగిలిన కుటుంబీకులు ఎవరైనా బయోమెట్రిక్ లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లాలి.
కానీ రెండేళ్లుగా విధుల్లోలేని వెంకటపతి దీక్షితులు, ఆయన ఇద్దరి కుమారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఆలయంలోకి వెళ్లటం వివాదంగా మారింది. ఈ విషయం టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోవడం గమనార్హం.