వీడియో: భూత వైద్యం పేరుతో పాడుపని, ప్రతిఘటించిన మహిళ హత్య; పోలీసుల ముందే భూతవైద్యుడ్ని చంపేసిన గ్రామస్తులు
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించిన నేటి రోజుల్లోనూ భూత వైద్యం పేరుతో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి అత్యాచార యత్నం చేయబోయాడు భూతవైద్యుడు. ప్రతిఘటించిన మహిళను కాళ్ళు కట్టేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు భూతవైద్యుడి ప్రాణాలు తీశారు.
వ్యవసాయ కూలీపై భూత వైద్యుడి కన్ను
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్ విజయ వ్యవసాయ కూలీ మేస్త్రీ గా పనిచేస్తుంది. సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలు అవసరమై ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వ్యవసాయ కూలీల కోసం వడ్డె పాలెం వెళ్ళింది విజయ. వ్యవసాయ కూలీలను పిలుస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య అనే భూతవైద్యుడి కన్ను విజయపై పడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించిన భూతవైద్యుడు ఓబయ్య ఆమెతో మాట కలిపి ఆమె మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్నాడు.
మోకాళ్ళ నొప్పులకు మందిస్తానని అత్యాచార యత్నం .. ప్రతిఘటించినందుకు దారుణ హత్య
తాను మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి మందు ఇస్తానంటూ నమ్మించి ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా షాక్ కు గురైన విజయ భూతవైద్యుడు ఓదయ్యను తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఈ విషయం బయటకు వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఓబయ్య ఆమెపై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేశాడు. అనంతరం గొడ్డలితో నరికి విజయ ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఓబయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్ళే క్రమంలో షాకింగ్ పరిణామం.. కర్రలతో ఓబయ్యను చావబాదిన గ్రామస్తులు
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓబయ్యను అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విజయలక్ష్మి దారుణంగా హతమార్చిన విషయం తెలుసుకున్న కామేపల్లి గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్య పై దాడికి దిగారు. అతన్ని బయటకు లాగి విచక్షణ రహితంగా కర్రలతో కొట్టారు. గ్రామస్తులను అడ్డుకోబోయిన ఎస్ఐ రజియా సుల్తానా పై కూడా గ్రామస్థులు దాడి చేశారు.
గ్రామస్తుల దాడిలో ఓబయ్య మృతి .. గ్రామంలో ఉద్రిక్తత
ఈ దాడిలో ఓబయ్య అక్కడికక్కడే మరణించాడు. అసలేం జరుగుతుందో అర్దమయ్యే లోపే ఓబయ్య విగతజీవిగా మారాడు. ఒక మహిళ దారుణ హత్య, ఆపై భూతవైద్యుడుపై గ్రామస్తుల దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జరుగుమల్లి మండలంలో భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. విజయలక్ష్మి హత్య జరిగిన చోట క్షుద్రపూజలు చేశారన్న ప్రచారం జరుగుతుంది.
గ్రామంలో భారీగా పోలీసులు.. హత్య, ప్రతీకార హత్యలపై దర్యాప్తు
ఓబయ్య అత్యాచారం చేసే క్రమంలో హత్య చేశాడా? లేదా క్షుద్రపూజల కోసం విజయలక్ష్మిని హత్యచేశాడా ? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మి మృతదేహంపై చాతీ భాగంలో దుస్తులు లేకపోవడంతో అత్యాచారయత్నం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో పోలీసులు ఓబయ్య ను తీసుకెళ్తున్న క్రమంలో ఓబయ్య పై దాడికి పాల్పడిన వారు ఎవరు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఓ హత్యకు బాధ్యుడైన నిందితుడిపై దాడి చేసి మరో హత్యతో ప్రతీకారం తీర్చుకున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురి చేస్తోంది.