గల్లా జయదేవ్కు అరుదైన అవకాశం:అవిశ్వాసం పై చర్చను ప్రారంభించనున్న గుంటూరు ఎంపి
అమరావతి:లోక్సభలో టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం చర్చను చేపట్టనున్న నేపథ్యంలో గుంటూరు ఎంపి గల్లా జయదేవ్కు రాజకీయపరంగా చక్కటి గుర్తింపు పొందే మంచి అవకాశం లభించింది.
టిడిపి అవిశ్వాసంపై రేపు లోక్ సభలో జరిగే చర్చను గల్లా జయదేవ్ ప్రారంభించనుండటమే ఆ అరుదైన అవకాశం. ఇందుకు గల్లా జయదేవ్ సరైన వ్యక్తిగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారట. ఆ తర్వాత వచ్చే అవకాశాన్ని ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని కొనసాగించాలని పార్టీ ఎంపి లకు చంద్రబాబు సూచించారట.
గతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన సందర్భంగా ఎంపి గల్లా జయదేవ్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగానికి మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. బాహుబలికి వచ్చిన కలెక్షన్ల కన్నా అమరావతికి కేంద్రం ఇచ్చిన నిధులు తక్కువగా ఉన్నాయని లోక్సభలో గల్లా చేసిన వ్యాఖ్య కు మంచి స్పందన లభించింది.