ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పండి: ప్రజలకు రావెల, జానీమూన్ అంశంపై..
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు తన కుటుంబ సభ్యులను కూడా వదిలి అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేసినప్పటికీ తనపై కొందరు నాయకులు కుమ్మక్కై దుష్ప్రచారం చేసి,
అమరావతి: సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు తన కుటుంబ సభ్యులను కూడా వదిలి అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేసినప్పటికీ తనపై కొందరు నాయకులు కుమ్మక్కై దుష్ప్రచారం చేసి, చివరకు తనను బలి పశువును చేశారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు.
ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. అపనిందలు తనను, తన కుటుంబాన్ని కలచివేశాయని పేర్కొన్నారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేసి, బలి పశువును చేశారన్నారు. ఇది తనను, తన కుటుంబాన్ని కలచివేసిందన్నారు.
ఇటీవల జరిగిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో రావెల కిషోర్ బాబుకు సీఎం చంద్రబాబు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ఇంత చేసినా..
తాను అంబేడ్కర్ భావజాలంతో మంత్రిగా కాలికి బలపం కట్టుకొని మరీ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రజానీకం కోసం పర్యటించి అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి ప్రతిష్ట తెచ్చేలా చేశానని పేర్కొన్నారు. గతంలో కంటే ఎన్నో కొత్త పథకాలు రూపొందించి అమలు చేశానని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను గత ప్రభుత్వాలు దారి మళ్ళిస్తే అటువంటి వాటికి తావులేకుండా పూర్తిస్థాయిలో ఖర్చు చేశానని, కొందరు టిడిపి నాయకులు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వక్రీకరించి దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను దోషిగా చేశారు.. కలచివేసింది
ఇతర నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు కొందరితో కుమ్మక్కై చిన్న చిన్న విభేదాలు సృష్టించి భూతద్దంలో పెట్టి చూపి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని పేర్కొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ వివాదంలోనూ తనకు సంబంధం లేకపోయినా త్రిసభ్య కమిటీ ఎదుట తనను దోషిగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వట్టి చెరుకూరులో గ్రూపు తగాదాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వాటికి తనను బాధ్యుడిని చేశారని, తనకు నియోజకవర్గంలో పట్టులేదన్న అపవాదు తనను కలిచివేసిందని పేర్కొన్నారు. ఇదే కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించారన్న అపవాదు తనను, తన కుటుంబ సభ్యులను కలచివేస్తోందన్నారు.

నాకు కుట్రలు తెలియవు
కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియవన్నారు. తనకు తెలిసిందల్లా ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించడమే అన్నారు. తనను, తన పదవిని కాపాడుకోవాల్సిన నియోజకవర్గ ప్రజలు ఈ విషయంలో న్యాయం చేయలేకపోయారని భావిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రజలారా.. బాబుకు చెప్పండి!
సొంత పార్టీ వాళ్ళే స్వార్థపూరితంగా, కుళ్ళు రాజకీయాలతో తనను బలిపశువును చేశారని, ఇది ఎంత వరకు న్యాయమో ప్రజలే ఆలోచించాలన్నారు. మీలో ఒకరిగా కష్టపడి అభివృద్ధి చేసిన తనను గుర్తించి నియోజకవర్గ ప్రజలు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తన కుటుంబంతో వారం రోజుల పాటు విదేశీయాత్రకు వెళ్తున్నానని, తిరిగి వచ్చే సరికి అన్ని సర్దుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఆత్మీయులైన నియోజకవర్గ ప్రజలతో మమేకమై మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిద్దామమన్నారు.












Click it and Unblock the Notifications