ఊహించని షాక్, బిత్తరపోయిన టీడీపీ: తిరిగి వైసీపీలోకి రవికాంత్, దెబ్బకు దెబ్బకొట్టిన నాని
గుడివాడ: తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగన్కు ఇక వరుస షాకులే! 'కొడాలి నాని వాడుకొని వదిలేద్దామని చెప్పారు'
ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కుట్రలు, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. త్వరలోనే వారి బండారం బయటపడెతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నీ బయటపెడతా
టీడీపీ నేతలు తనను ఎలా ప్రలోభ పెట్టారో త్వరలో ఆధారాలతో సహా చెబుతానని రవికాంత్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల కుట్రలు భరించలేకనే తాను ఆ పార్టీని వీడి సొంత పార్టీలోకి వచ్చానని తెలిపారు. వారు తనను బెదిరింపులకు గురి చేశారన్నారు. త్వరలో అన్నీ చెబుతానన్నారు.
ప్రలోభ పెడితే ఇలాగే జరుగుతుంది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. అంటే వైసీపీ నుంచి వెళ్లిన వారు తిరిగి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
టీడీపీ బిత్తరపోయేలా
రవికాంత్ ఇటీవలే టీడీపీలో చేరారు. అంతలోనే పదిరోజులు కాకముందు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది టీడీపీ నేతలను బిత్తపోయేలా చేసింది. టీడీపీ కుట్రలు భరించలేకనే రవికాంత్ వైసీపీని వీడారని గతంలోనే ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరిన రవికాంత్ అదే ఆరోపణలు చేశారు. రవికాంత్ రీ ఎంట్రీతో గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
దెబ్బకు దెబ్బకొట్టిన నాని
కాగా, రవికాంత్ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేసి సఫలమయ్యారని అంటున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు సమక్షంలో రవికాంత్ టీడీపీలో చేరారు. ఇప్పుడు కొత్త సంవత్సర ఆరంభంలోనే ఇద్దరు మంత్రులకు కొడాలి నాని దెబ్బకు దెబ్బ కొట్టారు.
170 స్థానాల్లో విజయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 170 స్ధానాల్లో వైసీపీ విజయం సాధించి తీరుతుందని కొడాలి నాని వేరుగా అన్నారు.
గన్నవరం నియోజకవర్గం నున్నలో ఏర్పాటు చేసిన పల్లె నిద్ర, రచ్చబండ కార్యక్రమంలో వంగవీటి రాధ తదితరులతో కలిసి అంతకుముందు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
వివక్ష చూపిస్తున్న టీడీపీ
ఓ కూడలిలో పార్టీ జెండా ఎగురవేసి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటంలో వివక్ష చూపుతోందన్నారు. దివంగత వైయస్ అమలుచేసిన సంక్షేమ పథకాలు ప్రజలు మనస్సులో స్ధిరస్ధాయిగా నిలిచాయన్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు.