రాయల టీ: ఎవరు మద్దతు, ఎవరు వ్యతిరేకం?

రాయల తెలంగాణ ప్రతిపాదనను అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డి ముందుకు తోశారు. కొంత కాలం దానిపై చర్చ సాగింది. అయితే, ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లి ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చింది. జెసి దివాకర్ రెడ్డి ప్రతిపాదనను ఇప్పుడు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి సమర్థిస్తున్నారు. సమర్థించడమే కాకుండా గ్రామ పంచాయతీలతో తీర్మానం చేయించి, పార్టీ అధిష్టానానికి సమర్పించారు.
కాగా, రాయలసీమకు చెందిన నాయకులు కొంత మంది దీని పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.
కాగా, రాష్ట్ర విభజనను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండడం వల్లనే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని ఆయన అంటున్నారు.
రాష్ట్ర స్థాయిలో పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలంతా రాయలసీమకు చెందినవారే కావడం విశేషం. ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే, అదే జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానూ ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ది కడప జిల్లా. ఈ ముగ్గురు నాయకులను కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి దుయ్యపడుతున్నారు. వీరు ముగ్గురు కూడా రాయల తెలంగాణకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ మొత్తంగానే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తుంటే, చంద్రబాబు మాత్రం అటూ ఇటూ కాకుండా మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో రాయల తెలంగాణ అనేది వారికి పట్టే విషయంగా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications