దీక్ష చేసే అర్హత లేదు: జగన్ జలదీక్షకు రాయలసీమ నేతలు వ్యతిరేకమేనా?
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి కర్నూలులో మూడు రోజుల పాటు చేయనున్న జలదీక్ష ప్రారంభమైంది.
కర్నూలు జిల్లా నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా వేదిక వద్ద వైయస్ జగన్ ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. ఈ జలదీక్షకు రాయలసీమ నుంచి వేలాదిగా ప్రజలు హాజరవుతారని అంచనాతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది. ఇందులో భాగంగా తెంలగాణ ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టుల నిర్ణయంపై, చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జగన్ ఈ జలదీక్షకు పూనుకున్నారు. కాగా, వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష వల్ల తెలంగాణ, రాయలసీమ మధ్య చిచ్చుపెట్టేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో వైయస్ జగన్ జలదీక్షకు మద్దతు తెలిపేందుకు రాయలసీమ నేతలు, కార్యకర్తలు వెనకడుగు వేస్తున్నారు. జగన్ చేపట్టిన జలదీక్షకు వ్యతిరేకంగా ఇప్పటికే రాయలసీమ జేఏసీ, రాయలసీమ విద్యార్థి జేఏసీ, ఆర్ఎంఎస్ఎఫ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ నిరసన దీక్షకు ఆదివారం సంఘీభావం తెలిపిన రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి, వైయస్ జగన్ దీక్షపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ జగన్ జలదీక్ష కర్నూలులో కాదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి వద్ద చేయాలని సూచించారు.
వైయస్ జగన్ జలదీక్ష రాయలసీమ గొంతు కోయడానికేనని మండిపడ్డారు. అధికార దాహంతో కోస్తా ప్రాంతంలోని 123 ఎమ్మెల్యే సీట్ల కోసం వైయస్ జగన్ దీక్ష చేపడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమను విస్మరించిన చంద్రబాబు, జగన్ ఇద్దరూ సీమ ద్రోహులేనని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనకు కారణం కూడా ఆ ఇద్దరేనని ఆరోపించారు. బ్రహ్మంగారు చెప్పినట్టు శ్రీశైలంలో పచ్చబండ బయట పడేలా ఉందని, పాలకులు, ప్రతిపక్షం వల్ల సీమ ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్రేవుల, సిద్దేశ్వరం, ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టుల కోసం జగన్ దీక్ష చేస్తే సీమ ప్రజలు సంతోషిస్తారని అన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో రాయలసీమ సమస్యలపై ఏనాడూనోరు విప్పని వైయస్ జగన్కు కర్నూలులో దీక్ష చేసే అర్హత లేదన్నారు. ప్రత్యేక హోదా, జలదీక్షల పేరుతో సీమ ప్రజలను పక్కదారి పట్టించడం వైయస్ జగన్కు తగదని బైరెడ్డి రాజశేఖర్రెడ్డి హితవు పలికారు.












Click it and Unblock the Notifications