ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు.. శ్రీశైలం టు అమరావతికి చైతన్య యాత్ర.. రాయలసీమ హక్కుల నేతలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరింత హీట్టెక్కుతోంది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ ఆ పాంత్ర రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.. అధికార వికేంద్రీకరణకు మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే శ్రీశైలం టూ అమరావతికి చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు తెలిపింది.
అమరావతి రైతులకు పోటీగా రాయలసీమ మేధావుల ఫోరం
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాయలసీమతో పాటు , ఉత్తరాంధ్రలోనూ రాజధానులు ఉండాలని రాయలసీమ హక్కుల వేదిక నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి రైతులు నిర్వహించిన సభకు పోటీగా రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక తిరుపతిలో ఆందోళన చేపట్టింది. ఈసందర్భంగా ఇంధిరా మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పాల్గొన్నరాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమతం కారాదన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
చంద్రబాబు రాయలీమ ద్రోహి
ఈ సభలో రాయలసీమ అధ్యయ సంస్థ అధ్యక్షడు భూమన్ మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలన్న డిమాండ్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు , నారాయణ, రామకృష్ణ రాయలసీమ ద్రోహులని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన సమగ్రాభివృద్ధి బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
శ్రీశైలం టు అమరావతి మహా పాదయాత్ర
మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు రాయలసీమ మేధావుల ఫోరం నేతలు తెలిపారు. ప్రతి విశ్వవిధ్యాలయంలో అధికార వికేంద్రీకరణ కోసం సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు నినాదంతో శ్రీశైలం నుంచి అమరావతి వరకు మహా పాదయాత్రను జనవరిలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. తమ పోరాటానికి మద్దతుగా ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతామని రాయలసీమ మేధావుల పోరం తెలిపింది.