కర్నూలు ఎందుకు కాదో తేల్చండి: రాజధానిపై బాబుకు
కర్నూలు/హైదరాబాద్: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని రాయలసీమ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు బుధవారం ఆరోపించారు. సీమ అభివృద్ధికి మరో ఉద్యమాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ పరిస్థితి, అభివృద్ధి, కార్యాచరణ పైన చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే రాజధానిని గుంటూరు - విజయవాడల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం రాయలసీమవాసులను అవమానపర్చడమే అన్నారు.
కొందరు ఇస్తున్న విరాళాలతో వారు రాజధానిని నిర్మించుకొని, కేంద్రమిచ్చే నిధులతో రాయలసీమలో రెండో రాజధానిని చేపట్టాలన్నారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన బీజేపీ అధికారంలో ఉన్నందువల్ల రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజధానిగా కర్నులు ఎందుకు అనువైనది కాదో తేల్చాలన్నారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాలను పరిశీలించాలన్నారు. కోస్తాంధ్ర ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా మారిందని, అపారవనరులున్న రాయలసీమ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని పార్టీల నాయకులపై ఒత్తిడి తేవాలని, ఈ నెల 15న హైదరాబాదులో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతామన్నారు.