రాయలసీమ ప్రత్యేక చిచ్చు: 14 నుంచి నేతల బస్సు యాత్ర
తిరుపతి: ఓ వైపు కాపు రగడ చెలరేగిన నేపథ్యంలోనే రాయలసీమలో ప్రత్యేక చిచ్చు రేగుతోంది. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు అవసరం గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఈ నెల 14వ తేదీ నుంచి బస్సు యాత్రలు చేపట్టాలని రాయలసీమ నాయకులు నిర్ణయించుకున్నారు.
ఆ విషయాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో రచయితలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రంతోనే తమకు న్యాయం జరుగుతుందని, దానికి ప్రత్యామ్నాయం లేదని వారన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని విమర్సించారు. ప్రాంతాలవారీగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కర్ణాటకలో అటువంటి రిజర్వేషన్ విధానం ఉందని వారు గుర్తు చేశారు.
రిజర్వేషన్లు ప్రాంతాలవారీగా కల్పిస్తే తప్ప వెనుకబడి, కరువు పీడత ప్రాంతాల యువకులకు ఉద్యోగాలు రాబోవని, ఈ ప్రాంత యువత అభివృద్ధి చెందిన, రాజధాని ప్రాంత యువతతో పోటీ పడలేదని వారన్నారు. బస్సు యాత్ర కరువుతో తల్లడిల్లుతున్న కర్నూలు జిల్లాలోని ఆలూరు గ్రామం నుంచి ప్రారంభమవుతుంది.
తమ బస్సు ప్రతి గ్రామానికి కూడా వెళ్తుందని, రాయలసీమ చైతన్య బస్సు యాత్రకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నాయకత్వం వహిస్తారని చెప్పారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు భూమనసుబ్రమణ్యం రెడ్డి (చిత్తూరు), ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి (అనంతపురం), మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి (చిత్తురూ)లతో పాటు దాదాపు 50 మంది రాయలసీమ కోసం పనిచేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.