కిరణ్తో రాయపాటి భేటీ: కొత్త పార్టీపై మరోసారి వ్యాఖ్య
తెలంగాణకు అనుకూలంగా కేబినెట్ నోట్ వచ్చాక తమ రాజీనామాలపై ఆలోచన చేస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తాము ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే ప్రయత్నం చేస్తామన్నారు. విభజన అనివార్యమైతే మాత్రం కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచన చేస్తామన్నారు.
ఉద్యోగుల సమైక్యాంధ్ర పోరాటానికి తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నామన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం తప్పదని రాష్ట్రపతి అన్నారని చెప్పారు. అసెంబ్లీకి విభజన తీర్మానం వచ్చి తీరాల్సిందే అన్నారు. కనీసం రెండుసార్లైనా అసెంబ్లీకి తీర్మానం వచ్చే అవకాశముందన్నారు. విభజన నిర్ణయం ఆపాలంటే సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలన్నారు.
ఇరు ప్రాంత నేతల భేటీ!
రాష్ట్ర విభజనపై ఓ అవగాహనకు వచ్చేందుకు రెండు మూడు రోజుల్లో ఇరు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ నేతలు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజనపై తలెత్తే సమస్యలు చర్చించేందుకు భేటీ కావాలని వారు భావిస్తున్నారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, సీనియర్ టి కాంగ్రెసు నేత పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఈ ప్రతిపాదన తీసుకురాగా మంత్రి గంటా శ్రీనివాస రావు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఇప్పటికే పలువురు నేతలు ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు.