నలువైపులా జగన్పై ఆపరేషన్, ముస్తఫాకి రాయపాటి గాలం: 'పీఆర్పీలోకి వెళ్తే ఎంతిచ్చారు'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ 2 పకడ్బందీగా ప్రయోగిస్తోందని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల నాటికి వైసిపి ఎమ్మెల్యేలను సగం మందిని తమ వైపుకు రప్పించుకునేందుకు పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా తమ నియోజకవర్గాలలో, తమ జిల్లాల్లో పట్టు ఉన్న టిడిపి నేతలు వైసిపి ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. కడప జిల్లాలో సీఎం రమేష్, విజయవాడలో దేవినేని ఉమ తదితరులు వైసిపి ఎమ్మెల్యేలకు గాలం వేసి ఫలప్రదమైన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లాలో కూడా టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావు వైసిపి ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. గుంటూరు తూర్పు వైసిపి ఎమ్మెల్యే ముస్తఫాను ఎంపీ రాయపాటి టిడిపిలోకి ఆహ్వానించారు. ముస్తఫా పార్టీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
తోటను కలిసిన జ్యోతుల
ఎంపీ తోట నరసింహను వైసిపి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు ఆదివారం నాడు కలిశారు. కిర్లంపూడి మండలం వీరవరసంలో వారు కలిశారు. తాము తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
రామచంద్రయ్యకు వర్ల రామయ్య కౌంటర్
టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ పైన కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య మండిపడుతున్నారు. ఆయనకు టిడిపి నేత వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. బ్రోకర్ పదానికి పర్యాయపదం సీ రామచంద్రయ్య అన్నారు. టిడిపిని వీడి పీఆర్పీలోకి వెళ్లినప్పుడు రామచంద్రయ్య ఎన్ని డబ్బులు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే, పీఆర్పీని విలీనం చేసిన ఘనుడు రామచంద్రయ్య అన్నారు.