బట్టలూడదీసుకుని తిరగాలా: రాయపాటి అసహనం, పవన్ కళ్యాణ్ ముందుంటే..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లెమంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు పార్టీ మరో పార్లెమంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో గొంతు కలిపారు. దానికి తోడు ప్రత్యేక హోదాపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా కోసం ఇంతకన్నా ఏం చేయాలి, బట్టలూడదీసుకుని తిరగమంటారా అని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద సహనం కోల్పోయి మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం బిజెపికి ఇష్టం లేదని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం తప్పు పనిచేస్తోందని, మొదట యుపిఎ ప్రభుత్వం ప్రాథమికంగా తప్పు చేసిందని ఆయన అన్నారు.
ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంపై మొండిగా ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో టిడిపి, బిజెపిలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అసలు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఎప్పుడున్నారని, మోడీది విజిటింగ్ వీసా అని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవ్ కళ్యాణ్ ముందండి నజిపిస్తే తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రం చెప్పలేదు..
కాగా, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగా చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా సాధ్యం కాదని మాత్రమే ప్రకటించారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని తెలిపారు.
బీజేపీతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, అందుకే ఆచితూచి స్పందించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా కాకపోతే ప్రత్యేక ప్యాకేజీ కోసమైనా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. జగన్ దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని విమర్శించారు. జగన్ తన కేసుల గురించి ఢిల్లీ లో దీక్ష చేస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం కాదని ఎద్దేవాచేశారు.