పార్టీలో కొందరిని వదులుకునేందుకు సిద్ధమే...తన్నుకు చావద్దు : సీఎం చంద్రబాబు
అమరావతి:పార్టీలో నేతల మధ్య విభేదాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలో సోమవారం కడప పార్లమెంట్ నేతలతో సమావేశం సందర్భంగా సీఎం టిడిపి అసంతృప్త నేతలకు చంద్రబాబు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.
"కలిసి పని చేయకపోతే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవు...పత్రికలకు ఎక్కి తన్నుకు చావద్దు...పార్టీలో ఒకరిద్దరిని వదలుకోడానికి సిద్ధమే...ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పని చేశారు. ఇప్పుడు మీకేమైంది"...అని చంద్రబాబు కడప జిల్లా నేతలపై మండిపడ్డారు. 2019లో మనం గెలవాలి...ఇందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాల్సిందేనని ఆయన కడప జిల్లా నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వాడీ వేడి సమావేశం...తీవ్ర హెచ్చరికలు
అమరావతిలో సోమవారం కడప పార్లమెంట్ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశం వాడీ వేడిగా కొనసాగినట్లు తెలిసింది. స్థానిక నేతల అభిప్రాయాలతో పాటు సీఎం నిర్వహించిన సర్వే నివేదికలు అన్నింటిని పరిగణనలోకి తీసుకొని కడప నేతలకు చంద్రబాబు సుదీర్ఘంగా క్లాస్ పీకినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ కష్టపడి పని చేయాలి. మంచి ఫలితాలే రాబట్టాలి. ఇప్పటి నుంచే విధి విధానాలతో ముందుకు నడవాలి అంటూ నేతలకు సీఎం క్లాస్పీకారు.
ఏ జిల్లాలో లేని విధంగా...సంక్షేమం
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కడప జిల్లాలో చేపడుతున్నామని, కలిసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన వారే పత్రికలకు ఎక్కి పరువు తీస్తున్నారని చంద్రబాబు కడప జిల్లా నేతలతో సమావేశంలో మండిపడ్డారు. ఇలాగైతే అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమంటూ సీఎం ఆగ్రహోదగ్రులయ్యారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలి తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడంతో మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఏమైంది మీకు? ఎన్నికల ముందు విభేదాలు సృష్టించుకుంటే ప్రజలు నమ్ముతారా? నెంబర్ వన్ స్థానంలో కడప జిల్లా ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. నాయకులు చేసే చిన్న చిన్న పొరపాట్లకు పార్టీ నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక సహించేది లేదంటూ ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డిని ఏమి చేస్తున్నారంటూ సీఎం ప్రశ్నించారు.
నిధులు...పరిశ్రమలు ఇచ్చాం
కడప ఉక్కు పరిశ్రమపై ఆందోళన చేద్దామన్నారు. రాష్ట్ర నుంచి కడపలో ఓ భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హార్టికల్చర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని రీతుల్లో చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం పేర్కొన్నారు. కడప జిల్లాకు నిధులు ఎంత అవసరమో అంతా ఇచ్చాం...పదవులు ఇచ్చాం...అన్ని ఇచ్చినా సమన్వయంతో లేకపోవడంతో విభేదాలతో పత్రికలకు ఎక్కి తన్నుకుంటున్నారు. ఇక ఇలాంటివి పునరావృతం కాకూడదు. నియోజకవర్గ ఇన్చార్జుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అందరూ కోఆర్డినేషన్తో పనిచేయాలి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కార్యకర్తల విషయంలో వివక్ష ఉండకూడదు. ఈ బాధ్యతను ఇన్చార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షులు పర్యవేక్షించాలని సిఎం దిశానిర్దేశం చేశారు.
సిఎం రమేష్...ఆమరణ నిరాహార దీక్ష
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కడప ఉక్కు పరిశ్రమ సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా గోహెడ్ అంటూ ఆదేశించారు. కమలాపురం నియోజకవర్గంలో గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించాలని ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధులు మంజూరు చేస్తామని సిఎం చంద్రాబాబు హామీ ఇచ్చారు.
ముఖ్య నేతలతో...విడిగా సమావేశం
సీఎం సమావేశంలో చంద్రబాబు జిల్లా నేతలపై సీరియస్ కావడం, ఆ తరువాత ఇన్చార్జ్మంత్రి సోమిరెడ్డి వారితో చర్చించి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలతో సీఎం విడిగా సమావేశమై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తూ ఇంత మంది ఉన్నా వేస్టే. ఇది మంచిపద్ధతి కాదు. ఎంతో కష్టపడాల్సిన సమయంలో ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగి పార్టీ పరువు తీస్తుంటే చూస్తుంటారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు ఎందుకు ఉండేది. తిని కూర్చునేందుకా? ఇది మంచిపద్ధతి కాదు అంటూ సీఎం సీరియస్ అయ్యారు.