ఆ లెక్చరర్ నా ప్రేయసిని వేధించారు, ఆమె కోసం నేను చనిపోతున్నా: ఇంజనీరింగ్ విద్యార్థి వాట్సప్ మేసేజ్
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధి ఆత్మహత్య కేసులో కీలక సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. తన ప్రేయసి కోసమే చనిపోతున్నానంటూ తన స్నేహితులకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి పంపిన వాట్సప్ మేసేజ్ పంపిన ఆధారాలు పోలీసుల చేతికి చక్కాయి.
ఈ వివరాలను పరిశీలిస్తే... ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలోఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్న సురేంద్రమణిదీప్ కుమార్ అనే యువకుడు, ఓ విద్యార్థిని ప్రేమించుకున్నారు. అయితే ఉన్నట్టుండి నర్సాపురం బీసీ హాస్టల్లో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధి సురేంద్రమణిదీప్ కుమార్ పెద్ద బ్రహ్మందేవం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. చనిపోయే ముందు మృతుడు తన స్నేహితులకు పంపిన వాట్సప్ ఆడియో మెసేజ్ ఆధారంగా అనేక కీలక ఆధారాలు బయటపడ్డాయి.
తాను ప్రేమించిన యువతిని కళాశాలకు చెందిన లక్ష్మణ్, ట్రిపుల్ఈ బ్రాంచ్ లెక్చరర్ శివప్రసాద్ మోసం చేసినట్లు స్నేహితులకు వివరించాడు. వీరి మోసానికి తన ప్రియురాలు చనిపోవాలని నిర్ణయించుకుందని అందుకే ఆమె కోసం తాను చనిపోతున్నట్టు అందులో పేర్కొన్నాడు.
తమ చావుకు కారణమైన ఆ ఇద్దరినీ వదలవద్దని స్నేహితులకు పంపిన చివరి సందేశంలో ఉంది. తమ బిడ్డ ఎవరి కోసమో చనిపోయేందుకు సిద్ధపడ్డాడని మణిదీప్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు కేసును సీరియస్గా తీసుకోవట్లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం హోంమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో పోలీసులు అలసత్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.