Vizag Steel Plant : జగన్, చంద్రబాబు అనాసక్తి-కేంద్రంతో పోరాడలేక- సోము పాత రికార్డు
దశాబ్దాల పోరాటంతో, ఎన్నో ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం మిగతా జాతీయ సంస్ధలతో పోలుస్తూ ప్రైవేటీకరణకు సిద్దమవుతున్నా ఏపీలో రాజకీయ పార్టీలకు మాత్రం చీమకుట్టినట్టు లేదు. నిత్యం రాజకీయాల్లో మునిగితేలుతున్న అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఈ విషయంలో కేంద్రంతో పోరాడేందుకు కనీస ఆసక్తి చూపడం లేదు. గతంలో కేంద్రానికి లేఖలు రాసి, పార్లమెంటులో నిలదీసిన ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు దీని ఊసెత్తేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఈ పోరు కమ్యూనిస్టుల పోరాటంగానే మిగిలిపోతోంది.

స్టీల్ ప్లాంట్ పోరుపై వైసీపీ, టీడీపీ అనాసక్తి
దశాబ్దాల పోరాటాలతో, కేంద్రం మెడలు వంచి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేటీకరణకు సలహాదారుల నియామకంతో పాటు టెండర్లు పిలిచేవరకూ వెళ్లినా ఏపీలో రాజకీయ పార్టీలు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం నుంచి విభజన హామీల్ని సాధించుకోవడంలో విపలమైన వైసీపీ, టీడీపీ ఇప్పుడు ఆంధ్రుల హక్కుగా తమ ముందుతరాలు సాధించుకున్న చారిత్రక స్టీల్ ప్లాంట్ ను సునాయాసంగా వదులుకునేందుకు వెనుకాడటం లేదు.

కనీస ప్రతిఘటన కరవు
ఓవైపు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా రాజకీయ పార్టీలు మాత్రం కనీస పోరాట పటిమ చూపలేకపోతున్నాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో తాము స్వయంగా పోరాటాలు చేయకపోయినా కనీసం కార్మికుల పోరుకు సంఘీభావం తెలిపేందుకు కూడా వైసీపీ, టీడీపీ సిద్ధపడటం లేదు. స్టీల్ ప్లాంట్ పోరు ప్రారంభమై నెలలు గడుస్తున్నా వైసీపీ టీడీపీ ప్రధాన నేతలెవరూ ఉద్యమంలో మాత్రం కనిపించలేదు. దీంతో కేంద్రం కూడా వేగంగా తమ పని పూర్తి చేసేస్తోంది.

చారిత్రక ఉద్యమంలో కనిపించని జగన్, చంద్రబాబు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నుంచి ప్రకటన వచ్చీ రాగానే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటనికి సిద్ధమయ్యాయి. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద కార్మిక సంఘాల పోరాటం ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. అయినా వైసీపీ, టీడీపీ అధినేతలు జగన్, చంద్రబాబు మాత్రం కనిపించడం లేదు. తాను తెరపైకి తెచ్చిన అమరావతి పోరు కోసం ఊరూరా తిరిగిన చంద్రబాబు, గత ప్రభుత్వంలో చంద్రబాబుపై పోరు కోసం భారీ పాదయాత్ర, ఉద్యమాలు చేసిన జగన్ ఈసారి చారిత్రక స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.

కేంద్రం భయంతో నోరెత్తని వైనం
సీబీఐ కేసుల్లో చిక్కుకుని కేంద్రంలో బీజేపీ పెద్దల కనుసన్నల్లో పాలన సాగిస్తున్న సీఎం జగన్, అలాగే కేంద్రం నుంచి ఎప్పుడే కేసు తరుముకొస్తుందో తెలియక చంద్రబాబు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. కేంద్రాన్ని ఎదిరించడం మాట అటుంచి కనీసం లాబీయింగ్ చేసేందుకు సైతం సిద్ధపడటం లేదు. కనీసం స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు కూడా జగన్, చంద్రబాబు ముందుకు రావడం లేదు. ఉద్యమంలో కనిపిస్తే తమ పాత కేసులు ఎక్కడ తిరగతోడతారన్న భయమే జగన్, చంద్రబాబులో కనిపిస్తోంది.
Recommended Video

సోము వీర్రాజు పాత రికార్డు
విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు జగన్, చంద్రబాబు సిద్ధం కాని పరిస్ధితుల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గతంలో విశాఖలో ఎంపీ స్ధానం గెల్చుకుని కాస్తో కూస్తో క్యాడర్ పెంచుకున్న బీజేపీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరులో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని తాజాగా మరోసారి సోము వీర్రాజు పాత పాడే పాడుతున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంతో మాట్లాడతానని వెళ్లి ఒట్టి చేతులతో తిరిగొచ్చిన సోము వీర్రాజు టీమ్.. ఇప్పుడు మరోసారి స్టీల్ ప్లాంట్ బాధ్యత ఏపీ బీజేపీ తీసుకుంటుందని మరో పాట మెదలుపెట్టారు.












Click it and Unblock the Notifications