ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న రివర్స్ పీఆర్సీ కానుక: ఢిల్లీలో నిరాహర దీక్షకు దిగిన రఘురామ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టనున్నారు. వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల పట్ల వారు తీవ్ర అసంతృప్తి, ఆందోళనను వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తోన్నారు. నల్లబ్యాడ్జీలను ధరించి విధుల్లో పాల్గొంటున్నారు. తాజాగా విడుదల చేసిన జీవోల్లో.. హెచ్ఆర్ఏలో భారీగా కోత పెట్టడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు. ఇదివరకు 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 16 శాతానికి కుదించింది ప్రభుత్వం.
జీవోలకు వ్యతిరేకం..
ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తాము వ్యతిరేకిస్తున్నామంటూ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఇదివరకే ప్రకటించారు. ఉద్యోగులకు నష్టం కలిగించే పీఆర్సీ తమకు వద్దని తేల్చి చెప్పారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉండటాన్ని తాము ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలోనూ వ్యతిరేకించామని, ఇప్పుడు 30 శాతం ఉన్న హెచ్ఆర్ఏను 16 శాతానికి తగ్గించి ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
అశుతోష్ మిశ్రా నివేదిక కోసం..
అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదిక మీదే చర్చించామని, ఇప్పుడు దీనికి భిన్నంగా ప్రభుత్వం జీవోలను జారీ చేసిందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మద్దతు పలికారు. వారికి అండగా నిలిచారు. ఉద్యోగుల పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన దేశ రాజధానిలోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు.
సాయంత్రం వరకూ..
ఈ ఉదయం 8 గంటలకు ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ సాయంత్రం 6 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం మొండివైఖరిని అనుసరిస్తోందని, ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం జగనన్న రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చిందని ఎద్దేవా చేశారు. 11వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అసంతృప్తిగా ఉన్నారని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. వారికి సంఘీభావంగా ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టానని అన్నారు.
ప్రజలు కూడా మద్దతు పలకాలి..
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో సేవ చేస్తోన్నారని, వారి డిమాండ్లను పెడచెవిన పెట్టడం మంచిది కాదని అన్నారు. ప్రజలందరూ కూడా ఉద్యోగులకు అండగా నిలవాలని, తమ మద్దతును తెలియజేయాలని రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. 11వ పీఆర్సీని యధాతథంగా ఆమోదించాలని, దానికి అనుగుణంగా కొత్త జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video
కనీవినీ ఎరుగని విధంగా..
ఇదివరకు వైఎస్ జగన్ సమక్షంలో జరిగిన పీఆర్సీ సమావేశంలో పీఆర్సీ ఫిట్మెంట్ను 23 శాతానికి పైగా ఖరారు చేయడాన్ని ప్రశంసిస్తూ.. ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇప్పుడు మండిపడుతున్నారని రఘురామ అన్నారు. మాకొద్దీ పీఆర్సీ అంటూ ఉద్యోగులందరూ సమైక్యంగా పోరాటాలకు దిగుతున్నారని చెప్పారు.
పీఆర్సీని పెంచని ప్రభుత్వాలను చూశామని, తగ్గించడాన్ని ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. అద్దెలు భారీగా పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో హెచ్ఆర్ఏలో కొత్త పెట్టడం సరికాదని రఘురామ చెప్పారు. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా పీఆర్సీ ఉందని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటాలకు సంఘీభావంగా తాను దీక్ష చేపట్టానని రఘురామ వివరించారు.