చంద్రబాబు , జగన్ లపై రెబల్ స్టార్ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు .. ఏమన్నారంటే
Recommended Video
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్న బిజెపి, కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బిజెపి అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహించి, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా బిజెపి తన మాస్టర్ ప్లాన్ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తుంది.
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అసలు పామే చనిపోతే కర్రెందుకు ... చంద్రబాబుపై కృష్ణం రాజు పరోక్ష వ్యాఖ్యలు
ఇక ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మెంబర్ షిప్ డ్రైవ్ లో పాల్గొన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు అటు చంద్రబాబు గురించి, ఇటు జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బిజెపి పట్ల ముందు తను సానుకూలంగానే ఉన్నాడని, ఆ తర్వాత బీజేపీతో కయ్యానికి కాలు దువ్వారని కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కాబోతున్నాయని కృష్ణంరాజు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న కృష్ణంరాజు చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న ఆయన అసలు పామే చనిపోతే కర్ర ఎందుకని చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు.
సానుభూతి కోసం చంద్రబాబు చేసిన విమర్శలు నిజం అవుతాయన్న రెబల్ స్టార్
ఎన్నికల ప్రచారంలో బిజెపి సర్కార్ తనను జైలులో పెడుతుందేమో అని అనవసరమైన విమర్శలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు అది నిజమయ్యే సమయం ఆసన్నమైందని కృష్ణంరాజు పేర్కొన్నారు. కేవలం సానుభూతి ఓట్ల కోసం బీజేపీ పై తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తప్పు చేసినవాడు ఎవరైనా సరే జైలుకు వెళ్లక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మ అయినా అడగకుండా అన్నం పెట్టదని, కేంద్ర అమ్మ కాకున్నా స్నేహపూరితంగా ఉంటే బాగుండేదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే చంద్రబాబు టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు సైతం చంద్రబాబుని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణాపై జగన్ కు అతి ప్రేమ మంచిది కాదని హితవు పలికిన బీజేపీ నేత కృష్ణం రాజు
ఇక జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో అంత స్నేహం మంచిది కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణపై అతి ప్రేమ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను చాలావరకు నెరవేర్చిందని, తెలుగు ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా బిజెపి పని చేస్తుందని కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇతర పార్టీ నుండి బీజేపీలో చేరేందుకు చాలామంది ఆసక్తితో ఉన్నారని, ముందు ముందు బిజెపిలోకి భారీగా వలసలు కొనసాగుతాయని రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు.