సీమాంధ్రలో అన్ని పార్టీలకి రెబల్స్ చిక్కు, బుజ్జగింపు
హైదరాబాద్: సీమాంధ్రలో శనివారం నామినేషన్ల జాతర ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే వారికి పోటీగా పలువురు తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. అన్ని పార్టీలలోను తిరుగుబాటు అభ్యర్థులు ఆయా పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి ఇంఛార్జిలు త్రిమూర్తులరాజు, నిమ్మక జయరాజ్ పార్టీ తిరుగబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు లోకసభ స్థానం నుంచి టిడిపి రెబల్గా నామినేషన్ వేసిన కేఈ ప్రభాకర్, శనివారం సమాజ్వాది పార్టీ తరఫునా నామినేషన్ వేశారు.

నందికొట్కూరులో టిడిపి రెబల్ అభ్యర్థిగా తమ్మడిపల్లె విక్టర్ కొనసాగుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి రెబల్గా సిట్టింగ్ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టివి రామారావు ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె దివ్వరాణి కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు.
తాడేపల్లి గూడెం స్థానాన్ని బిజెపికి కేటాయించినా, అక్కడి నుంచి టిడిపి నేత కొట్టు సత్యనారాయణ రెబల్గా నామినేషన్ వేశారు. పాలకొల్లు అసెంబ్లీ టికెట్ దక్కని స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బాబ్జీ రెబల్గా బరిలో ఉన్నారు. చింతలపూడిలో టిడిపి రెబల్గా సుమలత రంగంలో ఉన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెబల్గా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి నామినేషన్ వేశారు. కొవ్వూరు అసెంబ్లీ స్థానంలో ఏకంగా ముగ్గురు కాంగ్రెస్ రెబల్స్ బరిలో ఉన్నారు. అరిగెల అరుణకుమారి, ఎం రాణాప్రతాప్, జి సుందరరాజు డేవిడ్లు రెబల్స్గా బరిలో ఉన్నారు.
ఈ స్థానంలో జగన్ పార్టీ రెబల్గా కళానాగమణి రెబల్గా బరిలో ఉన్నారు. పాలకొల్లు స్థానం నుంచి జగన్ పార్టీ రెబల్గా గుణ్ణం నాగబాబు బరిలో ఉన్నారు. ఆచంట నియోజకవర్గంలో జగన్ పార్టీ రెబల్గా శ్రీనివాస్, దెందులూరులో రెబల్గా పివి రావు నామినేషన్ వేశారు. కాగా ఆయా రెబల్స్ను పార్టీలు బుజ్జగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications