బట్టలిప్పి కొట్టి, చంపారు: ఎర్రచందన దొంగల పాశవికదాడి
ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శేషాచలం కొండల్లోని పార్వేటి మండలంకు అధికారులు వెళ్లారు. వీరిపై ఎర్ర చందనం స్మగ్లర్లు పుల్లట్ల వద్ద రాళ్లతో దాడికి పాల్పడ్డారు. స్మగ్లర్ల దాడిలో అటవీ శాఖ అధికారులు ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఓ ఫారెస్ట్ అధికారిని స్మగ్లర్లు బట్టలు ఊడదీసి కొట్టి మరీ చంపారు. డేవిడ్ కరుణాకర్ అనే అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరు అధికారుల జాడ తెలియరాలేదు. దీంతో స్మగ్లర్లు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దొంగల దాడిలో గాయపడిన వారిని తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో నాలుగు అటవీశాఖ జీపులు కూడా ధ్వంసమయ్యాయి. దాడి సమాచారం తెలియగానే ఉన్నతాధికారులు అదనపు బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు.
కిరణ్ దిగ్భ్రాంతి
అటవీ శాఖ అధికారులపై దొంగల దాడిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. మంత్రి శత్రుచర్ల విజయరామారావు కూడా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.