జగన్ ఫొటోతో ఛాంబర్ లోకి : రెడ్ల రాజ్యం కాదు..వారు కూడా ఎస్సీలుగా : డిప్యూటీ సీఎం సంచలనం..!!
సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరో సారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. తొలి కేబినెట్ లో ఎస్సీ కేటగిరీలో డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించిన ఆయన ..తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలోనూ అదే హోదా -అదే శాఖలో కంటిన్యూ అవుతున్నారు. ఈ రోజు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన దేవుడి ఫొటో స్థానంలో సీఎం జగన్ ఫొటోతో ఛాంబర్ లోకి ప్రవేశించారు. తనకు రెండో సారి మంత్రిగా అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు.

అందుకే జగన్ ఫొటోతో ప్రవేశించాను
సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం చేస్తామని నారాయణ స్వామి స్పష్టం చేశారు. తమ శాఖలో సిబ్బందిని సస్పెండ్ చేసిన ప్రతీ సందర్భంలోనూ తాను బాధ పడ్డానని చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో జగన్ ఫొటోతో చాంబర్లోకి ప్రవేశించడంపై స్పందించిన ఆయన.. దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్.. అందుకే ఆయన ఫొటో పట్టుకునే చాంబర్లోకి ప్రవేశించానని చెప్పారు.

ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు..
సీఎం జగన్ తన మీద పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని స్పష్టం చేసారు. ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు గురి కావద్దు.. సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ఇది రెడ్ల రాజ్యం కాదని చెబుతూ... బడుగుల రాజ్యంగా అభివర్ణించారు. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చూసిన తరువాత తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. కాళ్లు పట్టుకుంటేనో.. కాకపడితేనో జగన్ పదవులివ్వరని.. పార్టీ కోసం పని చేసిన వారికి జగన్ గుర్తింపునిస్తారని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.

మంత్రిగా బాధ్యతల స్వీకరణ
ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. చిత్తూరు జిల్లా నుంచి సీఎం జగన్ తొలి కేబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా నారాయణ స్వామి సైతం ఉండగా.. ఇప్పుడు విస్తరణలో వీరిద్దరితో పాటుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రోజా సైతం మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే, ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ 2024 నాటికి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి సైతం అదే స్పష్టం చేసారు. దీంతో...2024 వరకు నారాయణ స్వామి పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ శాఖ పూర్తిగా కొనసాగుతుందా లేదా అనేది సైతం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications