మిడిల్ క్లాస్ మెలోడీస్: సర్పంచ్ ఆత్మహత్య కథ: సొమ్ము సెంటర్ది-షోకు స్టేట్ది: రఘురామ పంచ్
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరో లేఖ రాశారు. నవ సూచనలు (వినమ్రతతో) అనే కొత్త సిరీస్ను కొత్తగా ప్రారంభించిన ఆయన.. రెండో లేఖను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు అందజేయాల్సిన వేతన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిపాలన సినిమా కథను తలపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

1,500 కోట్ల బకాయిలు..
2018-2019 నాటి ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 1,12,443 కోట్ల రూపాయలను విడుదల చేయగా.. ఇందులో ఏపీ ప్రభుత్వం తన వాటా నామమాత్రంగా ఉందని అన్నారు. తన వాటా కింద ఏపీ ప్రభుత్వం 10,365 కోట్లను మాత్రమే మంజూరు చేసిందని అన్నారు. ఇంకా 1,500 కోట్ల రూపాయల మేర బకాయి ఉందని, దీన్ని వెంటనే విడుదల చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. 2018-2019 ఆర్థిక సంవత్సరానికే 1,500 కోట్ల బకాయి ఉండగా.. ఈ రెండేళ్ల వ్యవధిలో అది మరింత పెరిగి ఉండొచ్చని అన్నారు.

సొమ్ము సెంటర్ది..
ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోన్నప్పటికీ.. రాష్ట్రం తన వాటాను విడుదల చేయకపోవడం సరికాదని అన్నారు. ఈ విషయంలో సొమ్ము సెంటర్ది-షోకు స్టేట్ది అన్నట్లుగా పాలన తయారైందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉందని అన్నారు. అయిదు లక్షల రూపాయల లోపు విలువ ఉన్న పనులకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తోన్నట్లు ప్రభుత్వం ఇదివరకే న్యాయస్థానానికి తెలియజేసిందని, అదే సమయంలో ప్రతి సంవత్సరం 60 వేల కోట్ల రూపాయల మేర సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదే న్యాయస్థానానికి తెలియజేశారని గుర్తు చేశారు.

కేంద్ర మంత్రిని కలిశా..
జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉన్న బకాయిల వివరాలను తెలుసుకోవడానికి తాను స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిశానని రఘురామ తన తాజా లేఖలో పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు నిధులు సక్రమంగా అందట్లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. మూడేళ్లుగా నిధుల చెల్లింపులు లేకపోవడం వల్ల కూలీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారని అన్నారు. మేఘా, పీఎల్ఆర్ వంటి కాంట్రాక్ట్ కంపెనీలకు బిల్లులను క్లియరెన్స్ చేస్తోన్న ప్రభుత్వం.. కూలీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

మిడిల్ క్లాస్ మెలోడీస్..
ఈ తీరు తనను మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాను గుర్తుకు తెస్తోందని రఘురామ వ్యాఖ్యానించారు. సకాలంలో ఉపాధి హామీ పథకం నిధులను విడుదల చేయకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందుల వల్ల ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ ఆత్మహత్యకు పాల్పడే సీన్ తనకు గుర్తు వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం నెలకొని ఉందని రఘురామ చెప్పారు. వెంటనే ఈ పథకానికి సంబంధించిన బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పరిపాలన ఆర్థికంగా బలోపేతం కావడానికి సకాలంలో నిధులను బదలాయించాల్సి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications