Nara Lokesh : నారా లోకేష్ సీఐడీ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం-రేపు లేనట్లే..!
ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేష్ పై సీఐడీ నమోదు చేసిన కేసులో రేపు విచారణకు హాజరుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నారా లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనతో పాటు సీఐడీకీ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేపు జరగాల్సిన విచారణ కాస్తా వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ విచారణపై తొందరేముందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో సీఐడీ నమోదుచేసిన కేసుపై రేపు విచారణకు రావాలని ఢిల్లీలో అధికారులు ఆయనకు తాజాగా 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సీఐడీ విచారణకు హైకోర్టు గతంలో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ అధికారులు నోటీసు జారీ చేసి విచారణకు రమ్మని కోరారు. అయితే విచారణకు వచ్చేటప్పుడు తాను డైరెక్టర్ గా ఉన్న హెరిటేజ్ అమరావతిలో కొన్న ఆస్తుల వివరాలు, బోర్డు తీర్మానాలు కూడా తీసుకురమ్మని నోటీసుల్లో పేర్కొన్నారు.

సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో హెరిటేజ్ వివరాలు తీసుకురమ్మని కోరడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ను హెరిటేజ్ వివరాలు తీసుకురమ్మని కోరడం సరికాదని ఆయన న్యాయవాది వాదించారు. ఈ కేసు విచారణకు సీఐడీకి అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవించింది.
వాదనల అనంతరం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ విచారణను రేపటి నుంచి అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్టోబర్ 10వ తేదీన జరిగే విచారణకూ పలు షరతులు పెట్టింది. ఇందులో లాయర్ సమక్షంలోనే విచారణ చేయాలని ఆదేశించింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని మధ్యలో బ్రేకులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది












Click it and Unblock the Notifications