నారా లోకేష్ కు హైకోర్టులో ఊరట- స్కిల్ కేసులో అరెస్టు చేయొద్దని సీఐడీకి ఆదేశం..
ఏపీ హైకోర్టులో ఇవాళ టీడీపీ నేత నారా లోకేష్ కు తాత్కాలిక ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసుల్లో సీఐడీ అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న లోకేష్.. హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఉదయం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు సీఐడీ విచారణకు సహకరించాలని సూచించింది. అయితే స్కిల్ కేసులో మాత్రం ఆయనకు ఊరటనిచ్చింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నారా లోకేష్ పేరును చేరుస్తూ సీఐడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ను కూడా అరెస్టు చేయాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీలో ఉన్న లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరారు. దీంతో అంగీకరించిన హైకోర్టు.. మధ్యాహ్నం విచారణ జరిపింది.
అనంతరం నారా లోకేష్ ను స్కిల్ కేసులో వచ్చే నెల 4వ తేదీ వరకూ అరెస్టు చేయకుండా సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రభావం పడకుండా ఉండేందుకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కిల్ కేసులోనే ఇప్పటికే చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపైనా విచారణ కూడా అక్టోబర్ 4కు వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా లోకేష్ స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే ఏ నిర్ణయం తీసుకునేందుకు ఇష్టపడలేదు. సుప్రీంకోర్టు నిర్ణయం పెండింగ్ లో ఉన్నందున హడావిడిగా నిర్ణయం తీసుకోనప్పటికీ సీఐడీని లోకేష్ ను అరెస్టు చేయకుండా నిలువరించడం ఆయనకు ఊరటగా చెప్పవచ్చు. అయితే ఫైబర్ నెట్ కేసులో మాత్రం లోకేష్ ముందస్తు బెయిల్ పై విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications