సరిగ్గా ఇదే రోజు...జగన్దీ అదే లక్ష్యం: నాడు చిరు..నేడు పవన్ : చంద్రబాబు నమ్మకం ఇదే..!
మే14. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమైన రోజు. అప్పటి వరకు టీడీపీ..కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ పోరులో ఒక కుటుంబం ఎంతగా ఆదరణ పొందిందో గుర్తు చేసే రోజు. సుదీర్ఘ పాదయాత్ర తరువాత అప్పుటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఓడించి..ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఇదే..ఇప్పుడు జగన్కు సైతం స్పూర్తిగా మారింది. ఇక, నాటి వరకు చంద్రబాబు పాలన ఒక రక విధంగా సాగితే.. 2014 నుండి వైయస్ తరహాలోనే చంద్రబాబు సైతం సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు.
జగన్ నిలవాలంటే..
2003 ఏప్రిల్ 9న నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ చేవెళ్ల నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్ర అయన్ను ప్రజలకు దగ్గర చేసి తొలి సారిగా ముఖ్యమంత్రిని చేసింది. 2004 మే 14న ఆయన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తరువాత ఏపీలో అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, 108, ఉచిత విద్యుత్, పెన్షన్లు, పావలా వడ్డీకే రుణాలు అమలు చేసారు. ఆ అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యారు. జాతీయ పార్టీ నేత అయినా..కాంగ్రెస్ పార్టీ ఆయన హయాం లో ప్రాంతీయ పార్టీగా మారిందా అనే స్థాయిలో పట్టు సాధించారు. 2009 ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత నాది అంటూ పార్టీ అధినేత్రికి హామీ ఇచ్చి మరీ..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక, కొద్ది నెలలకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. తన తండ్రి పాలన అందిస్తానంటూ ప్రజల్లోకి వచ్చిన జగన్కు ఈ ఎన్నికల్లో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. ఆయన ప్రజల్లో నిలవాలంటే..ఇదే రోజు మే14 జగన్కు స్పూర్తినిచ్చే రోజు.
రాజన్న రాజ్యం అంటూ..
తన తండ్రి బాటలోనే విపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసారు. తండ్రి చేసిన మేలు కంటే ఒక అడుగు ముందుకు వేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా పాదయాత్ర చేసారు. ఎన్నికల ప్రచారంలోనూ తన తండ్రి పాలన గుర్తు చేస్తూ రాజన్న రాజ్యం తెస్తానంటూ చెప్పుకొచ్చారు. తన తండ్రి తరహాలోనే విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్నారు. నాడు వైయస్ విపక్ష నేతగా పాదయాత్ర..నేటి విపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసిన సమయంలో రెండు సందర్బాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉన్నారు. నాడు వైయస్ 2004లో చంద్రబాబు ను ఓండించి ముఖ్యమంత్రి అయ్యారు. మరి..ఈ ఎన్నికల్లో జగన్ సైతం అదే అంచనాలతో ఉన్నా..అది నిజమవుతుందా లేదా అనేది ఈనెల 23న తేలనుంది. తన తండ్రి లాగానే ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనేది తన కోరిక అని..తాను లేకపోయినా తన ఫొటో ప్రతీ ఇంట్లో పెట్టుకొనేలా పాలన చేయటమే తన లక్ష్యమని జగన్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు.
చంద్రబాబు నమ్ముకుందీ ఇదే..
2004 వరకు చంద్రబాబు హైటెక్ సీఎంగా పని చేసారు. 2004 నుండి వైయస్ పాలనలో అమలు చేసిన సంక్షేమం తిరిగి ఆయన్ను 2009లో మరోసారి ముఖ్యమంత్రిని చేసిందని అందరూ అంగీకరించాల్సిన అంశం. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, తాజా ఎన్నికల ముందు సంక్షేమ పధకాలను అమలు చేసారు. పెన్షన్ల పెంపు..పసుపు-కుంకుమ,అన్నదాత సుభీభవ వంటి పధకాల ద్వారా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. ఇవి నాడు వైయస్ను తిరిగి 2009లో ఏ విధంగా అయితే గెలిపించాయో..ఇప్పుడు తిరిగి తనను కూడా అదే విధంగా గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. నాడు చిరంజీవి కారణంగా వైయస్ గెలిచారనే చెప్పే.. చంద్రబాబు ఇప్పుడు పవన్ కారణంగా టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి..చంద్రబాబు-జగన్ ఇద్దరి ధీమాలో ఎవరిది నిజమవుతుందో ఈ నెల23న తేలనుంది.