సోనియాని నమ్మించారు: రేణుక ఫైర్, జగన్ జైలుకే: జెసి
హైదరాబాద్: సొంత పార్టీ తెలంగాణ నేతల పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి సోమవారం భగ్గుమన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అవాస్తవాలతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని, సీమాంధ్రలో ఏమీ కాదని సోనియాను నమ్మించారని విమర్శించారు.
ఇంద్రులం, చంద్రులం అనుకున్న వారికంతా ఇప్పుడు ఏమాత్రం నిద్రపట్టడం లేదన్నారు. అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే కానీ పని చేసే వారు మాత్రం ఉండరని ఎద్దేవా చేశారు. సెటిలర్స్ను ఆకట్టుకోవడంలోను తమ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. సోనియాకు బాధాకరమైన పరిస్థితులు కల్పించింది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలే అన్నారు.
29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటుంది: టిఎస్సార్
29 రాష్ట్రాల్లోను కాంగ్రెసు పార్టీ ఉంటుందని టి సుబ్బిరామి రెడ్డి అన్నారు. ఓటమికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు. సంపూర్ణ ప్రభుత్వంతో ఇబ్బంది అనే ప్రజలు బిజెపికీ మెజార్టీ సీట్లు ఇచ్చారన్నారు.
జగన్ జైలుకు ఖాయం: జెసి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మళ్లీ జైలుకు వెళ్లడం తప్పదని అనంతపురం టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. జెసి శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం ఖాయమన్నారు. త్వరలో జగన్ పార్టీ కనుమరుగవుతుందన్నారు.