రేపల్లెలో గ్యాంగ్రేప్: రైల్వేస్టేషన్లో దారుణం: భర్తను కొట్టి: ఎస్పీకి జగన్ ఫోన్: టీడీపీ ఫైర్
బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లెలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ముందే కిరాతకానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన భర్తను దారుణంగా కొట్టారు. రేపల్లె రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రేపల్లెకు చేరుకున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో ఇలాంటి ఘటన సంభవించడం ఇది నాలుగో ఘటన ఇది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నిందితులను త్వరితగతిన గుర్తించాలని, అరెస్ట్ చేయాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని సూచించారు. అటు తెలుగుదేశం పార్టీ ఈ దారుణం పట్ల స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం మరో బిహార్లా మారిందని ఆరోపించింది.

ప్రకాశం జిల్లాకు యర్రగొండపాలెం వెంకటాద్రిపురానికి చెందిన బాధితురాలు తన భర్త, పిల్లలతో కలిసి రాత్రి నాగాయలంకకు బయలుదేరారు. బస్సు అందుబాటులో లేకపోవడంతో రాత్రి రేపల్లె రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్పై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్తను కొట్టి.. ఆమెను ప్లాట్ఫామ్ పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.
నిందితులు కూడా యర్రగొండపాలేనికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ రేపల్లె పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేయించారు. బాధితురాలి నుంచి వివరాలను సేకరించిన అనంతరం పోలీసులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్.. ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్.. పూటకో రేప్ జరుగుతోందని మండిపడ్డారు. బిహార్ను మించిపోయిందని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు అదుపులో లేవని విమర్శించారు. పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హోం మంత్రి తానేటి వనిత- మహిళల తప్పిదాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని విమర్శించారు.












Click it and Unblock the Notifications