బాబుపై తెలంగాణలో నిఘా, ఫోన్ల ట్యాపింగ్పై అందుకే అనుమానం?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఫోన్లను ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసినట్లు తెలుస్తోందంటూ బుధవారం సాయంత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ అనుమానాలకు కారణాలు ఉన్నాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఏపీ పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇటీవల మరో అధికారికి ఫోన్ చేశారని, ఆ సమయంలో తెలంగాణ పోలీసుకు సంబంధించిన రింగ్ టోన్ వచ్చిందని, ఫోన్ ఎత్తింది మాత్రం ఏపీ కేడర్ అధికారేనని, దీంతో ఆ సీనియర్ అధికారి ఆశ్చర్యపోయాడని మీడియాలో వచ్చాయి.
దీంతో ఏపీ అధికారుల్లో అనుమానాలు వచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా కొందరు ముఖ్యమైన మంత్రుల ఫోన్ల పైన కూడా నిఘా పెట్టారని అంటున్నారు. తమ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల పైనే నిఘా వేశారనే విషయం ఏపీ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అయితే, పక్కా ఆధారాలు లేకుండా బయటకు చెప్పడం మంచిది కాదని భావిస్తున్నాయని తెలుస్తోంది. అధికారిక అనుమతులు, నిర్దిష్ట ప్రక్రియకు లోబడి కాకుండా ఇతరుల ఫోన్ల పైన నిఘా వేయడం, వారి కాల్ లిస్టులు సంపాదించడం నేరం. ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలపై కన్నేయడం మరింత సీరియస్ అంశం.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఫోన్లను ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసినట్లు తెలుస్తోందంటూ బుధవారం సాయంత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. ఎల్లవేళలా చంద్రబాబు చుట్టూ ఉండే వారి ఫోన్లు, చంద్రబాబు తరుచూ మాట్లాడే ఫోన్ల వివరాలపై ఆరా తీసింది.
ప్రభుత్వంలోని కొందరు అధికారుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారన్న దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిత్యం నిఘా పెడుతున్న వైనం వెలుగుచూసిందంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తాకథనం సారాంశం.