150 కోట్లతో 20 మందికి ఎర: కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిందనే వార్తాకథనాలు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు టిడిపి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కావాల్సి ఉండగా టిడిపి మొత్తం 20 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యులకు గాలం వేసినట్లు వార్తాకథనాలు వచ్చాయి. రూ. 150 కోట్ల రూపాయలతో ఆ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నట్లు ఆ వార్తాకథనాలు వ్యాఖ్యానించాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు చెందిన పత్రిక భావించే నమస్తే తెలంగాణలో మంగళవారం ఆ వార్తాకథనం ప్రచురితమైంది. ఇటువంటి కథనమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందన సాక్షి మీడియాలోనూ వచ్చింది. తాము దాదాపు 15 మంది శాసనసభ్యులను సంప్రదించామని టిడిపి తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి అరెస్టయిన సందర్భంలోనే చెప్పడం గమనార్హం.
త్వరలో జరిగే హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టిఆర్ఎస్ను దెబ్బ తీయడానికి కుట్ర చేశారని, దానికి తోడు కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా ఈ పన్నాగం పన్నారని నమస్తే తెలంగాణ పత్రిక వ్యాఖ్యానించింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ వెన్ను విరిస్తే కెసిఆర్ ప్రభుత్వం అస్థిరం పాలవుతుందని చంద్రబాబు వ్యూహంగా నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది.
రేవంత్ రెడ్డిని, మిగతా ఇద్దరిని ఎసిబి విచారిస్తున్న క్రమంలో ఈ కుట్ర కోణం బయపడిందని నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని ఎసిబి అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేప్ లీకయింది.